పనులకు 18న శంకుస్థాపన చేయనున్న మంత్రి బొత్స సత్యనారాయణ
విశాలాంధ్ర – విజయనగరం : రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రాజాం మునిసిపాలిటీలో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, పటిష్టవంతం చేసే పనులకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ బుధవారం ఉదయం 10 గంటలకు శంకుస్థాపన చేయనున్నట్టు రోడ్లు భవనాల శాఖ ఇ.ఇ. బి.వి.రమణ తెలిపారు. విజయనగరం – పాలకొండ రోడ్డులో 47వ కిలోమీటరు నుంచి 51వ కి.మీ.వరకు పట్టణ పరిధిలో విస్తరణ జరుగుతుందన్నారు. నాలుగు కిలోమీటర్ల పరిధిలో రోడ్డును రూ.16.67 కోట్లతో 80 అడుగులకు విస్తరించనున్నట్టు తెలిపారు. నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరించనున్న ఈ రోడ్డు విస్తరణలో భాగంగా ఇరువైపులా డ్రెయిన్లను కూడా నిర్మిస్తామని, సెంట్రల్ డివైడర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. విజయనగరం జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, స్థానిక శాసనసభ్యులు కంబాల జోగులు, ఎం.ఎల్.సి. పాలవలస విక్రాంత్, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. డా.బి.ఆర్.అంబేద్కర్ కూడలిలో విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 15 నెలల్లోగా ఈ పనులు పూర్తిచేసేందుకు విజయనగరంకు చెందిన నిర్మాణ సంస్థ పృథ్వి కన్స్ట్రక్షన్స్ తో రోడ్లు భవనాల శాఖకు ఒప్పందం జరిగిందన్నారు.