విశాలాంధ్ర – విజయనగరం అర్బన్ : తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం అశోక్ గారి బంగ్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు, అయన సతీమణి పూసపాటి సునీల గజపతి రాజు , విజయనగరం శాసనసభ తెలుగుదేశం- జనసేన – బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పాల్గొన్నారు. ముందుగా పూసపాటి అశోక్ గజపతి రాజు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి నివాళులు అర్పించి, విజయనగరం తో అనుబంధం కలిగిన మహనీయులకు ఘన నివాళులు అర్పించారు. తరువాత ప్రస్తుత ఎన్నికలలో NDA కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజుని పార్టీ కి చెందిన పెద్దలు ఆశీర్వదించి, ప్రజాసేవలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆమెను దీవించారు. అనంతరం వివిధ రంగాలలో విశేష సేవలందించిన డా . పి.ఎస్.ఎస్.ఎస్.ఆర్.గజపతి రాజు (ప్రముఖ వైద్యులు)
పెద్ది లక్ష్మీనారాయణ (వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు)
అబ్దుల్ రవూఫ్ (రక్తదాన శిబిరాల నిర్వహణ, మోటివేటర్)
దొడ్డి రాము (సీనియర్ ఎలక్ట్రీషియన్)
కళ్లేపల్లి భాగ్యలక్ష్మి, (బుర్రకథ కళాకారిణి)
లంక ఆదినారాయణ, (రైతు)
జనార్దన్ గారు, (100 పర్యాయాలు పైగా రక్తదాన చేసినవారు)
ఇనుగంటి సురేష్ కుమారి (ప్రముఖ న్యాయవాది) వారిని గౌరవిస్తూ శాలువాతో సన్మానించి వారికి జ్ఞాపిక బహుకరించడం జరిగింది. అనంతరం పూసపాటి అశోక్ గజపతి రాజు , పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలు ఇబ్బందులను తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరించేందుకు ఆనాడు తెలుగుదేశం పార్టీని నిర్మించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.