జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి
విశాలాంధ్ర – విజయనగరం : మద్యపానం, ఇతర చెడు అలవాట్లకు బానిసలైన వారిని గుర్తించి వారిలో మార్పు తీసుకురావాలని, వారికి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. నాటుసారా తయారీలో భాగస్వామ్యం కావటం, విక్రయించటం, తాగుడికి బానిసలుగా మారిన వారిని గుర్తించి వారిని ప్రత్యామ్నాయ వృత్తుల వైపు మళ్లించాలని సూచించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వారు గుర్తించిన వారికి వివిధ విభాగాల ద్వారా ఆర్థిక చేయూత అందించటం ద్వారా జీవనోపాధి కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఏడు మండలాల పరిధిలో నాటుసారా తయారీ, విక్రయం, తాగుడు వంటి వాటి చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో భాగస్వామ్యమైన వారికి జీవనోపాధి కల్పించే విషయమై కలెక్టర్ తన ఛాంబర్లో సోమవారం వివిధ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు.
స్పెషల్ ఎన్ఫోర్స్ మెంటు విభాగం గుర్తించిన 110 మందిలో ఇప్పటికే 88 మందికి వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా రూ.43 లక్షల మేర రుణాలు ఇప్పించి జీవనోపాధి కల్పించామని డీఆర్డీఏ ఏపీడీ కలెక్టర్ కు ఈ సందర్భంగా వివరించారు. మిగిలిన 22 మందికి త్వరలోనే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే పలువురు టెంటు హౌస్, ఆటోలు, నెట్ సెంటర్లు, కొబ్బరి వ్యాపారాలు చేసుకుంటున్నారని, మిగిలిన వారు పశువుల పెంపకం ద్వారా జీవనోపాధి పొందుతున్నారని వెల్లడిరచారు.సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీదేవీ రావు, సెబ్ ఏసీ శైలజా రాణి, ఎస్.డి.సి. పద్మావతి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి గోవిందరావు, మెప్మా పీడీ సుధాకర్, పశు సంవర్ధక శాఖ జేడీ రమణ, బీసీ కార్పొరేషన్ ఈడీ పెంటోజీరావు, ఏఎల్ డీఎం, డీఆర్డీఏ ఏపీడీ, ఏపీఎం ఇతర అధికారులు పాల్గొన్నారు.