సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్…
ఏలూరు: ఈనెల 16,17 తేదీలలో ఏలూరులో జరిగే సిపిఐ జిల్లా ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో సిపిఐ జిల్లా ప్రధమ మహాసభల కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మహోజ్వల పోరాటాలు చేసిన చరిత్ర సిపిఐ కి ఉందన్నారు. వన సంరక్షణ సమితులు ఏర్పాటుకు, అటవీ బంజర్లు పేదలకు దక్కించడం కొరకు చేసిన పోరాటాలలో సిపిఐ అగ్ర భాగాన ఉందన్నారు. కొల్లేరు పరిరక్షణకు, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యను పరిష్కరించి, ప్రాజెక్టు తక్షణం నిర్మించాలని, చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని, సిపిఐ డిమాండ్ చేస్తుందన్నారు. టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వాలని అనేకసార్లు ఉద్యమాలు నిర్వహించిందన్నారు. ఉమ్మడి జిల్లా సమగ్రా అభివృద్ధికి, పారిశ్రామిక ప్రగతికి అనేకమంది కమ్యూనిస్టు యోధులు ఎర్రజెండా చేత పట్టి ప్రజల పక్షాన నిలబడి అనేక పోరాటాలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జిల్లాలు విడిపోయిన ప్రత్యేక పరిస్థితులలో సిపిఐ ప్రధమ మహాసభ ఏలూరులో జరుగుతుందని తెలిపారు. ఈనెల 16వ తేదీ వేలాది మందితో ప్రదర్శన, బహిరంగ సభ జరుగుతుందని, 17వ తేదీ స్థానిక శ్రీకాశీ విశ్వేశ్వర కళ్యాణమండపంలో 250 మందితో ప్రతినిధుల సభ జరుగుతుందని తెలిపారు. ఈ మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఓబులేసు, అక్కినేని వనజ హాజరవుతారన్నారు. మహాసభలు జయప్రదం కావడానికి అన్ని వర్గాల ప్రజలు సహాయ సహకారాలు అందించి తోడ్పడవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఉప్పులూరి హేమ శంకర్, పుప్పాల కన్నబాబు, కడుపు కన్నయ్య, జమ్మి శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు గేదెల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.