భువనేశ్వర్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో జూనియర్ ఉపాధ్యాయుల వేతనాన్ని 50 శాతం పెంచుతున్నట్లు ఒడిశా ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. రెగ్యులర్, కాంట్రాక్టు జూనియర్ ఉపాధ్యాయుల జీతం జనవరి 1, 2022 నుండి అమలులోకి వచ్చేలా 50 శాతం పెరిగింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రస్తుతం నెలకు రూ.7,400 పొందుతున్న కాంట్రాక్టు జూనియర్ ఉపాధ్యాయులకు ఇకపై నెలవారీ రూ.11,000 జీతం లభిస్తుంది. అదేవిధంగా రెగ్యులర్ జూనియర్ టీచర్లకు ప్రస్తుతం ఉన్న రూ.9,200లకు బదులు రూ.13,800 నెలసరి వేతనం అందుతుంది. ఈ పెంపు వల్ల రాష్ట్ర ఖజానాపై ఏడాదికి రూ.168 కోట్ల అదనపు భారం పడనుంది. 19,714 రెగ్యులర్, 13,324 కాంట్రాక్టు జూనియర్ టీచర్లతో సహా 33,000 మంది జూనియర్ ఉపాధ్యాయులు ప్రయోజనం పొందుతారని ప్రభుత్వం తెలిపింది.