దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా చాలా రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి గణనీయంగా పెరగడానికి ఒమిక్రాన్ వేరియంట్ కారణం కావచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక ఈ నెలలోనే దేశంలో కరోనా వైరస్ ఉధృతి గరిష్టానికి చేరుతుందని ఐఐటీ కాన్పూర్ నిపుణులు చేసిన అంచనాలు వాస్తవరూపానికి దగ్గరగా ఉన్నాయని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్కె అరోడా పేర్కొన్నారు. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868కు పెరిగింది. నిన్న 407 మందిలో కొత్తగా ఈ వేరియంట్ నమోదైంది. ఈ కేసుల పరంగా మహారాష్ట్ర, రాజస్థాన్, దిల్లీ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. అలాగే 1,805 మంది కొత్త వేరియంట్ బారి నుంచి కోలుకున్నారు. ఇక కరోనా కేసులు దాదాపు రెండు లక్షలకు చేరుకున్నాయి. దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,94,720 కొవిడ్ పాజిటివ్ కేసు నమోదయ్యాయి. 442 మంది మృతి చెందారు. 60,405 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,55,319కు చేరుకుంది. రోజువారి కొవిడ్ పాజిటివ్ రేటు 11.05 శాతంగా నమోదైంది.