టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్లోకి వైసీపీ నేతలు ప్రత్యక్షమవడంపై సీఐడీ అడిషనల్ డీజీపీకి ఆ పార్టీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. రెండు రాజకీయ సమూహాల మధ్య గొడవలు పెట్టేందుకు వైసీపీ నాయకులు ఈ చర్యలకు పాల్పడ్డారని అన్నారు. టెన్త్లో ఫెయిల్ అయిన విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని నింపేందుకు లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారని తెలిపారు. కొంతమంది వైసీపీ నేతలు తప్పుడు పేర్లతో లాగిన్ అయ్యి మీటింగ్లోకి చొరబడ్డారన్నారు. అనుచిత పదజాలంతో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో తెలిపారు. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి, కొత్తపల్లి రజనీలు మీటింగ్లోకి అక్రమంగా చొరబడ్డారన్నారు. రెండు రాజకీయ వర్గాల మధ్య గొడవలు పెట్టాలని చూసిన అధికార వైసీపీ నేతలపై మోసం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని కోరారు. వీలైనంత త్వరగా విచారించి దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.