మరో మూడురోజులూ ఇదే పరిస్థితి!
రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రాజధాని హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కృష్ణా, గోదావరి నదులకు భారీగా ఇన్ ఫ్లో వస్తున్నందున ప్రాజెక్ట్ ల విషయంలో జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
గత 24 గంటల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ వర్షం కురిసినట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కామారెడ్డి, నల్గొండ జిల్లాలలో భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు అత్యధికంగా నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కొండూరులో 186 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు గా తెలుస్తోంది. నిర్మల్ జిల్లా అబ్దుల్లాపూర్ లో 178 మిల్లీ మీటర్లు, నిజామాబాద్ జిల్లా కొండపల్లిలో 158 మిల్లీ మీటర్లు, సూర్యాపేట జిల్లా మునగాల లో 156 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.