విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యోచనను నిరసిస్తూ ఆగస్టు 2,3 తేదీలలో నిర్వహించనున్న చలో పార్లమెంట్ను జయప్రదం చేయాలని కోరుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో కార్మికులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూర్మన్నపాలెం దీక్షా శిబిరం నుంచి దువ్వాడ రోడ్డు మీదుగా ముస్తఫా జంక్షన్ నుంచి కణితి నిర్వాసిత కాలనీ, వడ్లపూడి నిర్వాసిత కాలనీ, హైవే మీదుగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పోరాట కమిటీ కన్వీనర్ జె.అయోధ్య రాం, కో కన్వీనర్ గంధం వెంకట్రావు, కె.సత్యనారాయణ రావు, సభ్యులు వై.మస్తానప్ప మాట్లాడుతూ గడచిన 164 రోజులుగా ఇదే ప్రాంతంలో నిరాహారదీక్షలు చేస్తున్నామనీ, ఈ పోరాటం విశాఖకే పరిమితం కాకుండా రాష్ట్రమంతా వ్యాపించిందని చెప్పారు. ఈ పోరాటాన్ని మరింత విస్తృతం చేయడంలో భాగంగా ఇప్పటికే దిల్లీ వెళ్లి బీజేపీయేతర రాజకీయ పక్షాల మద్దతు కూడగడుతున్నామని తెలిపారు. శాంతియుతంగా చేస్తున్న పోరాటం పై స్టీల్ప్లాంట్ యాజమాన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. కవ్వింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, విశాఖ ఉక్కు పరిరక్షణా పోరాట కమిటీ చైర్మన్ సిహెచ్.నర్సింగరావు, మంత్రి రాజశేఖర్, డి.ఆదినారాయణ, సభ్యులు వైటీి దాస్, జె.సింహాచలం, మురళి రాజు, జె.రామకృష్ణ, కొమ్మినేని శ్రీనివాస్, సిహెచ్.సన్యాసిరావు, విళ్ళ రామోహన్ కుమార్, డి.సురేష్ బాబు, పరంధామయ్య, డేవిడ్, వరసాల శ్రీనివాస్, మహాలక్ష్మి నాయుడు, జీఆర్కే నాయుడు, అప్పలరాజు, ప్రజా సంఘాల నాయకులు గడసాల అప్పారావు మహిళా సంఘాల ప్రతినిధులు, సీపీఐ, సీపీిఎం, వైఎస్ఆర్, జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు , వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు