సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శ
విశాలాంధ్ర బ్యూరో`పెద్దపల్లి : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ హక్కులను కాలరాస్తూ దాడులకు పూనుకుంటున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని కోయకొచగూడెంలో ఆదివాసుల మహిళలపై ఫారెస్ట్, పోలీస్ అధికారులు దాడి చేసిన ఘటనపై నిజాలు తెలుసుకునేందుకు కోయకొచగూడెం సందర్శించిన అనంతరం మంచిర్యాలీ జిల్లా సీపీఐ కార్యాలయంలో నారాయణ విలేకరులతో మాట్లాడారు. అడవులను కాపాడుతోంది ఆదివాసీయులైతే ప్రభుత్వాలు వారి హక్కులను కాలరాస్తూ కేసులు నమోదు చేస్తూ జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. అటవీ భూములను, అడవులను పాలకులు సామ్రాజ్య వాదులకు దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. ఆదివాసులే లేకుంటే అడవి, భూమి ఉండేవి కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసులకు, గిరిజనులకు, హరిజనులకు భూముల పట్టాలిస్తామని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చి సంవత్సరాలు దాటుతున్నా పట్టించుకునే నాథుడే లేడని మండిపడ్డారు. ఆదివాసులపై దాడులు పునరావృతమై సీపీఐ అధ్వర్యంలో పోరాటలకు వెనుకడామని హెచ్చరించారు. వెంటనే కోయకొచగూడెం ఆదివాసులపై కేసులు ఎత్తివేసి దాడులు చేసిన ఫారెస్ట్ అధికారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేన శంకర్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల కార్యదర్శులు కొయ్యడ సృజన్ కుమార్, సదానందం, మంచిర్యాల సీపీఐ జిల్లా నాయకులు, సీపీఐ అనుబంధ సంఘాల బాధ్యులు రామడుగు లక్ష్మణ్, మేకల దాసు, మిరియాల రాజేశ్వరరావు, కే వీరభద్రయ్య, ఎస్కే బాజీ, సైదా ముష్కి, సమ్మయ్య, కొట్టే కిషన్రావు, రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, బి సుదర్శన్, దాగం మల్లేష్ , దుర్గ రాజ్, గుండా మాణిక్యం, కనుకుంట్ల సన్నీ గౌడ్లిం, లింగం రవి, మొగిలి లక్ష్మణ్, ఖలింద్ర, అలీఖాన్ ఉన్నారు.