హర్ ఘర్ తిరంగా కార్యక్రమం సందర్భంగా బీజేపీ నేతలు పార్టీ కార్యాలయంలో సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట్రంలో పర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని అమలు చేసే దిశగా కృషి చేస్తామని డీకే అరుణ తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా సదస్సును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా.. సంబురాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు తెలిపారు. మన దేశభక్తిని, జాతీయ భావాన్ని అందరం కలిసి చాటి చెప్పాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా, బూతు స్థాయి వరకు ఈ కార్యక్రమం జరుపుకోవాలి డీకే ఆరుణ అన్నారు. ప్రతి ఇంటి పైనా త్రివర్ణ పతాకం ఎగుర వేయాలని చెప్పారు.
విభజన సందర్భంగా ముంపు మండలాలను ఏపీలో కలిపారని.. కానీ కేసీఆర్ ఇప్పుడు రాజకీయ కారణాలతో మాట్లాడుతున్నారని డీకే అరుణ మండి పడ్డారు. అక్కడి ప్రజలు తెలంగాణలో కలపాలని ఎప్పటి నుంచో కోరుతున్నారని… అక్కడ కనీస వసతులు లేవు, కనీస అవసరాలు తీర్చ లేదని ఆమె పేర్కొన్నారు. అందుకే ప్రజల నుంచి డిమాండ్ లు పెరుగుతున్నాయని చెప్పారు.
షర్మిల ఏపీలో పార్టీ ఎందుకు పెట్టలేదు?
కాళేశ్వరం విషయంలో జగన్, కేసీఆర్పై మంచి అండర్ స్టాండిరగ్ ఉందని విమర్శించారు. ఓట్లు సమయంలో మాత్రమే వాళ్లు వ్యతిరేకిస్తారని దుయ్యబట్టారు. సెంటిమెంట్ తోనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు కోరుకున్నారని అన్నారు… వైయస్సార్ కుటుంబంలో వచ్చిన విభేదాల వల్లే షర్మిల పార్టీ పెట్టారని చెప్పారు. గతంలో వాళ్లు ఎప్పుడూ తెలంగాణ కోసం పోరాడలేదని, పని చేయ లేదని డీకే అరుణ వ్యాఖ్యానించారు. సెంటిమెంట్ ఉన్నంత వరకు… ఆంధ్రా వాళ్లు ఎవరు పార్టీ పెట్టినా ప్రజలు ఆదరించరన్నారు. షర్మిల ఏపీలోనే పోటీ చేయవచ్చు కదా… తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారని ప్రశ్నించారు. 2019 ఎన్నికలలో కూడా షర్మిల ఏపీలోనే ప్రచారం చేశారని గుర్తు చేశారు. అప్పుడు తెలంగాణలో ఆమె ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఏపీలో ఎందుకు పోటీ చేయడం లేదో ఆమే చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.