ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల (ఆగస్టు) 5వ తేదీన శుక్రవారం విస్తారంగా వానలు పడే అవకాశమున్నట్లు ఆ రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించింది. ఐదారు జిల్లాలు మినహా అన్నిచోట్లా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. కర్నూల్, నంద్యాల, అనంతపూర్, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. నెల్లూరు జిల్లాలోని పలుచోట్ల కుండపోత పడొచ్చని పేర్కొంది. వైఎస్సార్, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు వివరాలను ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ గురువారం ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.