గోరంట్ల న్యూడ్ వీడియోపై జగన్ స్పందించాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: విద్యుత్ ట్రూఅప్ చార్జీల పేరుతో వినియోగదారులపై రూ.2900 కోట్లు భారం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవ్వడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలన్నారు. జగన్ అధికారం చేపట్టిన తరువాత ఏడు విడతలుగా విద్యుత్ చార్జీలు పెంచి, కేటగిరీలు రద్దు చేసి, శ్లాబులు కుదించి ప్రజలపై గుదిబండ మోపారన్నారు. అధికారంలోకొస్తే విద్యుత్ చార్జీలు పెంచబోనని గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని జగన్ విస్మరించి పదేపదే కరెంటు చార్జీలను పెంచి, ప్రజలపై భారాన్ని మోపుతున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు మరోసారి దాదాపు 36 మాసాలపాటు విద్యుత్ ట్రూ అప్ చార్జీల పేరుతో రూ.2900 కోట్ల భారాన్ని విద్యుత్ వినియోగదారులపై మోపేందుకు జగన్ సర్కార్ సిద్ధమవ్వడం దుర్మార్గమన్నారు. గతంలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజల నుంచి నిరసనలు రావడంతో ట్రూఅప్ చార్జీల విధింపును వాయిదా వేస్తూ వచ్చిన ప్రభుత్వం ఆగస్టు నుంచి మోపడాన్ని ఖండిరచారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఈ విషయమై స్పందించాలని, ప్రభుత్వమే విద్యుత్ ట్రూ అప్ చార్జీల భారాన్ని భరించాలన్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, వంటనూనెలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని వివరించారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచారనీ, పెరిగిన ధరలతో సాధారణ ప్రజలు తీవ్ర సతమతమవుతున్న నేపథ్యంలో కరెంట్ ట్రూఅప్ చార్జీల భారం సరికాదన్నారు. విద్యుత్ ట్రూఅప్ చార్జీల విధింపును తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వమే ట్రూ అప్ భారాన్ని భరించి, నిధులు విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఆ వీడియోపై వాస్తవాలు తేల్చాలి
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై స్పందించాలని వేరొక ప్రకటనలో రామకృష్ణ డిమాండ్ చేశారు. మాధవ్ ‘న్యూడ్ వీడియో’ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. సాక్షాత్తూ ఎంపీ ఒక మహిళతో అభ్యంతరకరమైన రీతిలో వీడియోకాల్ మాట్లాడుతున్న వీడియో సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, మహిళలపట్ల అగౌరవం కనిపిస్తోందన్నారు.
అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడడం విచారకరమని పేర్కొన్నారు. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఘటనతో ఇప్పటికే వైసీపీ ప్రతిష్ఠ మంటగలిసిందని, పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పరువు మంటగలిపేలా, ఆ వీడియో వైరల్ అవ్వడం విచారకరమన్నారు. దీనిపై సీఎం జగన్ స్పందించాలని, నిజానిజాల నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఆ వీడియో నిజమైతే ఎంపీ గోరంట్ల మాధవ్పై చర్యలు చేపట్టాలని,. మార్ఫింగ్ అయితే అందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.