నోయిడాలో సూపర్ టెక్ టవర్ల కూల్చివేతకు స్వరం సిద్ధం
మధ్యాహ్నం 2.30కు కూల్చివేయనున్న అధికారులు
కూల్చివేత వీక్షించేందుకు వీఐపీ గ్యాలరీ ఏర్పాటు
దేశంలోనే అత్యంత ఎత్తయిన నివాస సముదాయాలపైన జంట భవనాల కూల్చివేతకు రంగం సిద్దమైంది. నోయిడాలో అక్రమంగా నిర్మితమైన 100 మీటర్ల ఎత్తు ఉన్న ఈ టవర్లు 15 సెకండ్లలో నేల మట్టం కానున్నాయ. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ భవనాలను భారీ పేలుడు పదార్థాలను అమర్చి నేటి మధ్యాహ్నం 2.30 గంటలకి కూల్చివేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నోయిడాలో సూపర్టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాల కూల్చివేతకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ చుట్టుపక్కల కాలనీల్లో నివసిస్తున్న ప్రజల్లో ఆందోళన మొదలైంది. చుట్టుప్రక్క భవనాల్లో నివసిస్తున్న వారిని ఆదివారం ఉదయం 7 గంటలకే అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించామని స్థానిక అధికారులు తెలిపారు. అలాగే దగ్గరలోని నివాసాలకు వంటగ్యాస్, విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పెంపుడు జంతువులు, వాహనాలను కూడా అక్కడి నుంచి తరలించారు. కూల్చివేతకు పావు గంట ముందే సమీపంలోని నోయిడా ఎక్స్ప్రెస్ వేపై వాహనాల రాకను ఆపివేయనున్నారు. భవనాలు కూలిన తర్వాత వచ్చే దుమ్ము తగ్గిన తర్వాత రహదారిని తిరిగి తెరుస్తారు. జంట టవర్ల సమీంలో 560 మంది పోలీసు సిబ్బంది, 100 మంది రిజర్వ్ బలగాలు, 4 క్విక్ రెస్పాన్స్ టీమ్లు, ఎన్డీఆర్ఎఫ్ల బృందాలను మోహరించారు. జంట టవర్ల సమీప ప్రాంతాల్లోకి ఎవ్వరూ రాకుండా ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. టవర్ల కూల్చివేతను దూరం నుంచి చూసేందుకు వీఐపీ గ్యాలరీలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సమయం, భద్రత అంశాలను దృష్టిలో ఉంచుకొని పేలుడు పదార్థాల ద్వారా ‘కంట్రోల్డ్ ఇంప్లోజన్’ (వాటర్ఫాల్ ఇంప్లోజిన్) విధానంతో కొన్ని సెకండ్లలో కూల్చేయనున్నారు. ఈ టెక్నిక్ను 1773లో ఐర్లాండ్లోని వాటర్ఫోర్డ్లో హోలీ ట్రినిటీ కేథడ్రాల్ భవనం కూల్చివేతకు తొలిసారిగా ఉపయోగించారు. వంతెనలు, సొరంగాలు, భవనాలు, ఇతర నిర్మాణాలను కూల్చివేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ విధానమే అత్యంత భద్రమైనదని తేలింది.