పోలవరంపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పోలవరం ప్రాజక్టు నిర్మాణం వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు సమస్యలు వస్తున్నాయని ఒడిశా, ఛత్తీస్ఘడ్ , తెలంగాణకు చెందిన పలువురు వ్యక్తులు, సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రాజక్టుకు ఇచ్చిన పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి నిర్మాణం చేపట్టారని, ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా విస్తరించారని ఆ మూడు రాష్ట్రాలు ఆరోపించాయి. రాష్ట్రాలు, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అనుమతులకు, ప్రాజక్టు నిర్మాణానికి పొంతన లేదని పేర్కొన్నాయి. పర్యావరణ అనుమతులపై పునః సమీక్ష చేయాలని మూడు రాష్ట్రాలు కోరాయి. పోలవరం నిర్మాణం వల్ల భద్రాచలం ఆలయం ముంపునకు గురవుతుందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. అన్ని పిటిషన్లు కలిపి జస్టిస్ సంజయ్ కిషన్కౌల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విషయంలో వాస్తవాలతో కూడిన నివేదిక అందించాలని కేంద్ర జలశక్తి శాఖను కోర్టు ఆదేశించింది. అదేవిధంగా… కేసుకు సంబంధించి అదనపు సమాచారంతో కూడిన పత్రాలు సమర్పించేందుకు అవకాశం కల్పించాలని ఒడిశా, ఛత్తీస్ఘడ్, తెలంగాణ రాష్ట్రాలు ధర్మాసనాన్ని కోరాయి. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతిస్తూ.. కేసు తదుపరి విచారణ డిసెంబర్ 7కు వాయిదా వేసింది.