కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో ఓ సభ నుంచి బదులిచ్చారు. కాంగ్రెస్ పనైపోయిందని ఒక్క ముక్కలో తేల్చేశారు. వచ్చే ఏడాది ఆరంభంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, అహ్మదాబాద్ లో పారిశుద్ధ్య కార్మికులతో కేజ్రీవాల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియా ఆయనను ప్రశ్నించింది. పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం దివాలా ముంగిట నిలిచి, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో గుజరాత్ ఎన్నికల కోసం కోట్ల రూపాయలను వాణిజ్య ప్రకటనల రూపంలో ఖర్చు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది… దీనిపై మీరేమంటారు? అని మీడియా ప్రతినిధి కేజ్రీవాల్ ను అడిగారు. కేజ్రీవాల్ స్పందిస్తూ… ‘‘కాంగ్రెస్ కథ ముగిసింది… వాళ్లు అడిగే ప్రశ్నల గురించి మాట్లాడకండి. ప్రజలకు దీనిపై చాలా స్పష్టత ఉంది. కాంగ్రెస్ లేవనెత్తే అంశాల గురించి పట్టించుకోవడం అనవసరం’’ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, కాంగ్రెస్ కు ఓటు వేసి తమ ఓట్లను వృథా చేసుకోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. గుజరాత్ లో బీజేపీకి తామే ప్రత్యామ్నాయమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. గుజరాత్ లో బీజేపీ ఉండరాదని భావిస్తున్నవారే కాంగ్రెస్ ను కూడా వ్యతిరేకిస్తున్నారని, అలాంటి వారి ఓట్లను పొందేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.