వార్డు సభ్యులు వసికేరి మల్లికార్జున విజ్ఞప్తి
విశాలాంధ్ర- ఉరవకొండ : మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని 15వ వార్డులో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వార్డు సభ్యుడు వసికేరి మల్లికార్జున గ్రామ సర్పంచ్ లలిత,ఉపసర్పంచ్ వన్నప్ప ఇంచార్జ్ కార్యదర్శికి సమస్యలతో కూడిన విన్నత పత్రాన్ని అందించి విజ్ఞప్తి చేశారు. సోమవారం గ్రామపంచాయతీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మల్లికార్జున మాట్లాడుతూ తమ వార్డుల్లో శానిటేషన్ జరగకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని దోమల నివారణకు కూడా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని కాలనీ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే శానిటేషన్ పనులు తో పాటు దోమల నివారణకు పాగింగ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం చేయాలన్నారు. వార్డుల్లో ప్రజలు అనేకమంది సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారని తక్షణమే అక్కడ వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలన్నారు. వార్డు పరిధిలో ఉన్న హైవేలో బట్టర్ ఫ్లై లైట్ వెలగడం లేదని ఈ విషయం తాను జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని అయితే కలెక్టర్ లైట్లు యొక్క నిర్వహణ గ్రామపంచాయతీకి అప్పగించడం జరిగిందని తెలిపారని అయినప్పటికీ ఇప్పటివరకు కూడా లైట్లు వెలగడం లేదని అన్నారు. లైట్లు లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ విషయంలో తక్షణమే స్పందించి లైట్లు వెలిగేలా చూడాలన్నారు. గ్రామ సచివాలయ నిధులలో భాగంగా శివరామిరెడ్డి కాలనీలో స్థానిక గౌరమ్మ ఇంటి నుంచి శివ ఇంటి వరకు 180 మీటర్ల సిసి రోడ్డు నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని ఆయన అధికారులకు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.