న్యూదిల్లీ: భారత ఫాస్ట్బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ ఎంట్రీపై మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ సీజన్లో బుమ్రా ఏడు మ్యాచ్లు ఆడకపోయినంత మాత్రాన ప్రపంచం ఏమీ ఆగిపోదని అన్నాడు. ఐపీఎల్ పదహారో సీజన్ మార్చి 31న మొదలు కానుంది. కాగా బుమ్రా పదహారో సీజన్ ఐపీఎల్కు అందుబాటులో ఉంటాడా? లేదా? అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. అందుకు కారణం.. జాతీయ క్రికెట్ అకాడమీ ఇంకా బుమ్రాకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఆకాశ్ చోప్రా ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘బుమ్రా మనదేశ సంపద. ఒకవేళ బీసీసీఐ అతడిని ఐపీఎల్కు అనుమతించకుంటే ముంబై ఇండియన్స్ అందుకు ఒప్పుకుంటుంది’ అని ఆకాశ్ చోప్రా తెలిపాడు. అంతేకాదు ఐపీఎల్లో ఈ స్టార్ పేసర్పై వర్క్లోడ్ పడకుండా చూడాల్సిన బాధ్యత ముంబై ఇండియన్స్, బీసీసీఐపై ఉందని ఈ మాజీ క్రికెటర్ అన్నాడు. ఎన్సీఏలో ఉన్న బుమ్రా త్వరలోనే జట్టుతో కలవనున్నాడు. ఈ ఏడాది టీమిండియా రెండు మెగా టోర్నీలు ఆడనుంది. ఒకటేమో.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్, రెండోది వన్డే వరల్డ్ కప్. ఈ ప్రధాన టోర్నీలకు బుమ్రా ఫిట్గా ఉండడం చాలా ముఖ్యం’ అని చోప్రా అన్నాడు. కాగా భారత జట్టుకు యార్కర్ కింగ్ బుమ్రా ఎంత కీలక ఆటగాడో తెలిసిందే. అందుకని అతని విషయంలో రిస్క్ తీసుకునేందుకు బీసీసీఐ ఏమాత్రం సిద్ధంగా లేదు. అతను పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ సాధించేంత వరకు ఆగాలని భావిస్తోంది. కాబట్టే బుమ్రాను ఆస్ట్రేలియాతో బోర్డర్` గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టులకు, మూడు వన్డేల సిరీస్కు కూడా బీసీసీఐ ఎంపిక చేయలేదు. పోయిన ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో బుమ్రా స్ట్రెస్ ఫ్రాక్చర్తో బాధ పడ్డాడు. దాంతో, ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ కూడా ఆడలేదు. వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా క్రికెట్కు దూరమై దాదాపు ఐదు నెలలు కావొస్తోంది.