ముస్లింల పవిత్ర రంజాన్ మాసం గురువారం ముస్లింల పవిత్ర రంజాన్ మాసం గురువారం సాయంత్రం నెల వంక దర్శనంతో ప్రారంభమైంది. ఇస్లామిక్ క్యాలెండర్లో 9వ నెల రంజాన్. ఈ మాసంలో ఉపవాసదీక్షలు చేపట్టడం ఆనవాయితీ. ఈ మాసంలోనే దివ్యఖురాన్(మతగ్రంథం) అవతరించింది. నెల రోజుల పాటు ముస్లింలు నియమనిష్ఠలతో దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. శుక్రవారం నుంచి ఉపవాసదీక్షలు ప్రారంభం కాగా, ప్రార్థనలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. రంజాన్ ముగిసే వరకు ప్రతి రోజూ మసీదుల్లో ఇఫ్తార్ విందుల ఏర్పాటుకు కావాల్సిన వసతులను కల్పించింది. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని శాఖల్లో పని చేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పని వేళల్లో మార్పులు చేసింది. ప్రార్థనలు చేసుకునేందుకు సాయంత్రం 4 గంటలకే కార్యాలయం నుంచి వెళ్లేందుకు ఇప్పటికే అనుమతి మంజూరు చేసింది.
ప్రశాంతంగా జరుపుకోవాలి: కొప్పుల
ముస్లింలు ప్రశాంతంగా ప్రార్థనలు జరుపుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, మైనార్టీ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. రంజాన్ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు తేవాలని ఆకాంక్షించారు. ప్రార్థనలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన వెల్లడించారు.