జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్ విశాలాంధ్ర
విజయవాడ : చిన్నారుల్లో శ్వాసకోస వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న న్యూమెకోకల్ కాంజుగేట్(పీసీవీ) వ్యాక్సిన్ను వేయించడానికి తల్లిదండ్రులను చైతన్యపరచి సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్ చెప్పారు.
పీవీసీ వ్యాక్సిన్్పై శనివారం జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్ సంబంధిత అధికారులతో విజయవాడలోని ఆక్సిజన్ వార్ రూమ్లో జిల్లా టాస్క్పోర్స్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చిన్నపిల్లలు శ్వాసకోస వ్యాధి బారినపడకుండా పీవీసీ వ్యాక్సిన్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని తెలిపారు. సంవత్సరంలోపు పిల్లలకు 6 వారాలకు ఒక డోసు, 14 వారాలకు ఒక డోసు, 9 నెలలకు మరొక డోసు చొప్పున 3 డోసులుగా వ్యాకిన్ను వేయించాలని సూచించారు. వచ్చేవారం నుంచి పిల్లలకు ఈ వ్యాక్సిన్ అందించే కార్యక్రమం ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులకు ఆదేశించారు. వ్యాక్సిన్ అత్యంత ఖరీదు అయినా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నదన్న సమాచారన్ని తల్లిదండ్రులకు తెలియజేసి వారి పిల్లలకు వ్యాక్సిన్ వేయించేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ ఎం.సుహాసిని, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, డీఈవో తహేర సుల్తానా, ఐసీడీఎస్ పీడీ ఉమారాణి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి డాక్టర్ శర్మిష్టా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.