ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం సచివాలయానికి చేరుకున్న మంత్రి లోకేశ్ కు వేదమంత్రోచ్ఛారణలతో పండితులు స్వాగతం పలికారు. అనంతరం నాలుగో బ్లాక్లోని తన ఛాంబర్ లో లోకేశ్ ప్రత్యేక పూజలు చేసి, ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల బాధ్యతలు చేపట్టారు. పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు. కాగా, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేశ్ కు ఆయన తల్లి నారా భువనేశ్వరి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. వేదపండితుల వెంట లోకేశ్ సచివాలయంలోని తన ఛాంబర్ కు వెళ్లడం, బాధ్యతలు స్వీకరిస్తున్న వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. ఏపీని ఐటీ రంగంలో అభివృద్ధిపథంలో నడిపిస్తావనే నమ్మకం తనకుందని భువనేశ్వరి చెప్పారు. ఐదేళ్ల పదవీకాలం విజయవంతం కావాలని, రాష్ట్రం పురోభివృద్ధికి, ప్రజలకు సేవ చేయడానికి లోకేశ్ సామర్థ్యం ఉపయోగపడాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్ లో పేర్కొన్నారు.మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్ తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపై చేశారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో రూం నంబర్ 208 లో లోకేశ్ ఛాంబర్ ఏర్పాటు చేశారు. తన ఛాంబర్ లో ఎలాంటి ఆర్భాటాలు వద్దంటూ మంత్రి లోకేశ్ తన కుర్చీకి చుట్టిన టవల్ ను తీసేశారు. ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టాక మెగా డీఎస్సీకి ఆమోదం తెలుపుతూ సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. మెగా డీఎస్సీ కింద 16347 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ సీఎం చంద్రబాబు సంతకం చేసిన విషయం తెలిసిందే.
విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ కూడా అదే ఫైలుపై తొలి సంతకం చేశారు. అంతకుముందు సచివాలయంలో మంత్రి లోకేశ్ కు అధికారులు ఘన స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన మంత్రి లోకేశ్ కు సహచర మంత్రులు నిమ్మల రామానాయుడు, రాంప్రసాద్ రెడ్డి, సవిత, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ ఎంపీ కనకమేడల, పార్టీ ఎమ్మెల్యేలు తదితరులు అభినందనలు తెలిపారు.