ఇన్స్పెక్టర్ వై జి.శంకర్
విశాలాంధ్ర`ఉరవకొండ : తూనికలు కొలతలలో వ్యాపారస్తులు వినియోగదారులను మోసం చేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తూనికలు కొలతలు శాఖ ఇన్స్పెక్టర్ వై జి.శంకర్ అన్నారు. శనివారం ఉరవకొండలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వినియోగదారులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారస్తులు ఎలక్ట్రానిక్ కొలతల మిషన్లతో కూడా వినియోగదారులను మోసం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చాయని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు తమ శాఖ అధికారులు ఎలక్ట్రానిక్ కొలతల మిషన్లకు సీల్ వేసి సర్టిఫికెట్ కూడా మంజూరు చేయడం జరుగుతుందని వ్యాపారస్తులు ఆ సర్టిఫికెట్ కూడా తమ షాపులలో బహిరంగంగా ఉంచాలన్నారు. తక్కువ తూకం ఉన్న ఆయిల్ ప్యాకెట్లు, ఎలాంటి తేదీ లేని అనుమతులు లేని స్వీట్ వస్తువులు ప్యాకెట్ లో అమ్మకాలు చేస్తున్నారని దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు ఇలాంటివి చిన్నపిల్లల ఆరోగ్యానికి హానికరం అన్నారు. వీటి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరవకొండ పట్టణంలో కూరగాయలు వ్యాపారం చేసే వ్యాపారస్తులు తక్కువ తూకాలు ఇచ్చి వినియోగదారులను మోసాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని త్వరలోనే దాడులు నిర్వహిస్తామన్నారు. తూనికలు కొలతలు పైన మరియు వ్యాపారస్తులు పంపిణీ చేస్తున్న వస్తువుల పైన ప్రజలందరూ కూడా అవగాహన కలిగి ఉంటే మోసాలు జరగవు అన్నారు. ఎవరైనా వ్యాపార వర్గాల వారు నిబంధనలకు వ్యతిరేకంగా వినియోగదారులును మోసం చేస్తుంటే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ ప్రకాష్, మెకానిక్ ప్రకాష్ సిబ్బంది పాల్గొన్నారు.