ప్రత్యేక హోదా సాధించేంత వరకు పోరాటం ఆగదు
రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ వేమయ్య యాదవ్
విశాలాంధ్ర- కదిరి : కదిరి పట్టణంలోని స్థానిక ఎన్జీవో హోం కార్యాలయంలో మంగళవారం నాడు విద్యార్థి ,యువజన సంఘాలు ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లం రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా కన్వీనర్ యం.వేమయ్య, ఎస్కేయూ ప్రొఫెసర్ సదాశివరెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కే.శివారెడ్డి, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంతోష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ మోడీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో తిరుపతిలో వెంకన్న సాక్షిగా చెప్పారని ఇప్పటి వరకు బిజేపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు కల్లి బొల్లి మాటలతో కాలయాపన చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.వెనుకబడిన రాయలసీమ,ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తూ కొత్త రాజధాని అభివృద్ధి కోసం నిధులు, పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఏపికి పది సంవత్సారాలు ప్రత్యేక హోదా ఇస్తామని రాజకీయ లబ్ది కోసం అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తడం లేదని, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉపాధ్యాయ సంఘాలు ధర్నాకు పిలుపు నిస్తే విజయవాడకి లక్ష మంది ఏకమై ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తుంటే వారిపై అక్రమ కేసులు బనాయించి ముఖ్యమంత్రి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మరో మారు బ్రిటిష్ పాలన సాగుతుందని విభజన చట్టంలోని హామీల కోసం సమర శంఖారావాన్ని ఈ నెల 20 తేదీ నుండి ఫిబ్రవరి 5 వరకు హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు జరిగే బస్సు యాత్రను జయప్రదం చేయడానికి ప్రజా సంఘాలు వామపక్ష పార్టీ నాయకులు, విద్యార్థి, యువజన సంఘాలు ఏకమై ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నాగార్జున , తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడు బాబ్జాన్, ఎన్ ఎస్ యు ఐజిల్లా అధ్యక్షుడు ప్రసాద్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజా, కుళ్లాయప్ప, టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడు సల్మాన్, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు మధు నాయక్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఇసాక్, కదిరప్ప, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహులు, జగన్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గంగాధర్, టిడిపి పట్టణ కార్యదర్శి ఇర్ఫాన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్స్ పవన్, అరుణ్, మహేంద్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబ్జాన్ ,సిపిఐ నాయకులు ఇమ్రాన్,ముబారక్ ,తదితరులు పాల్గొన్నారు.