రైతులను ప్రోత్సహించి వ్యవసాయాన్ని కాపాడాలి
అధ్యక్షులు నాగమల్లి ఓబులేసు
విశాలాంధ్ర- ఉరవకొండ : జై కిసాన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం ఉరవకొండలో జాతీయ రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నిరంతరం రైతులను ప్రోత్సహిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అర్జించే పంటను రైతులు సాగు చేసుకోవాలని ప్రకృతి,సేంద్రియ వ్యవసాయానికి రైతులు అలవాటు పడాలని అనేక అవగాహన సదస్సులు కార్యక్రమాలను నిర్వహిస్తున్న జై కిషన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగమల్లి ఓబులేసు ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక బైపాస్ రోడ్డు నుంచి పట్టణంలోనే తొగటవీర క్షత్రియ కళ్యాణమంటపం వరకు రైతులు,విద్యార్థులు, వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కళ్యాణమండపం లో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఓబులేసు మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాలని రైతులను దేవుళ్ళుగా పూజించి ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాక అనేకమంది వ్యవసాయానికి దూరమవుతున్నారని. మరి కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వీటన్నింటిని అధిగమించి వ్యవసాయాన్ని పండగ చేసి రైతే రాజు అనే నానుడిని నిజం చేయాల్సిన అవసరం ప్రభుత్వాలతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరికి ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రమాదవశాత్తు మృతి చెందిన యువ రైతుల కుటుంబ సభ్యులను ఫౌండేషన్ వారు ఘనంగా సన్మానించి సాయం అందించారు. ప్రకృతి,సేంద్రియ వ్యవసాయాన్ని కొనసాగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న రైతులను పురుషులతో పాటు సమానంగా వ్యవసాయం చేస్తున్న మహిళలను కూడా ఈ సందర్భంగా సన్మానించారు. వ్యవసాయానికి సంబంధించి అనేక అంశాలను రైతులకు తెలియజేస్తున్న జర్నలిస్టులను, విశ్రాంతి నిరుపేద రైతులను కూడా గౌరవించి సన్మానించారు. వ్యవసాయ పై అనేక అంశాలను రాసిన ఉత్తమ విద్యార్థులకు బహుమతులు కూడా ప్రధానం చేశారు. పేద రైతుల యొక్క బిడ్డలను గుర్తించి వారికి పుస్తక సామగ్రిని అందజేశారు. సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ప్రతినిధులను ఉపాధ్యాయులను ఈ సందర్భంగా పౌండేషన్ వారు ఘనంగా సన్మానించారు అంతేకాకుండా రైతులకు ఉచిత వైద్యం అందించేందుకుగా ను అనంతపురంకీ చెందిన కిమ్ సవేరా ఆస్పత్రి వారు గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్వాహకులు కూడా రైతులకు కంటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించి వైద్యం అందించారు. అంతకుముందు ప్రకృతిని, వ్యవసాయాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో తెలియజేసే నాటక ప్రదర్శన కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ అర్బన్ సీఐ హరినాథ్ రూరల్ సీఐ శేఖర్, ఎస్సై వెంకటస్వామి, ఎంపీడీవో అమృతరాజు వీరితో పాటు వ్యవసాయ శాఖ అధికారులు, వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన సిబ్బంది, విద్యార్థులు సాంస్కృతి కార్యక్రమాల బృందం జై కిసాన్ ఫౌండేషన్ సభ్యులు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు