సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా ఆయనను నియమిస్తూ జూన్ 15న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు మూడేళ్ల అనంతరం ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ శాఖ పట్ల తనకు పూర్తి అవగాహన లేదని చెప్పారు. అయితే తనకు ప్రాధాన్యత లేని పోస్టు ఇచ్చారని తాను అనుకోవడం లేదన్నారు.ముత్యాలంపాడులోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్కు గతంలో ఘనకీర్తి ఉండేదని.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రింటింగ్ విభాగం ఆదరణ పొందుతూ వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మిగిలిన ఈ విభాగంలోని స్థితి గతులను అధ్యయనం చేస్తానని చెబుతున్నారు. గతంలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు ఇక్కడే ప్రింటింగ్ అయ్యేవని.. కానీ ప్రస్తుతం కార్యకలాపాలపై సిబ్బందితో చర్చించి అభివృద్ధికి కృషి చేస్తాను అన్నారు. దీన్ని ప్రాధాన్యత లేని పోస్టింగ్ గా తాను భావించడం లేదని చెప్పారు. ఉద్యోగుల నియామకాల విషయంలో ప్రభుత్వం తన ఆలోచనల మేరకు చేస్తుందని అన్నారు.