కేంద్రం తీసుకువస్తున్న అగ్నిపథ్ సైనిక నియామక విధానంపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో నిరసనకారులు రైళ్లను లక్ష్యంగా చేసుకుని విధ్వంసానికి పాల్పడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లోనూ భారీ విధ్వంసం జరగ్గా, పోలీసుల కాల్పుల్లో ఓ యువకుడు మరణించాడు. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఇవాళ ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న ఘటన దురదృష్టకరం అని పేర్కొన్నారు. అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్ మెంట్ ప్రక్రియపై చేపట్టిన నిరసనల నేపథ్యంలో జరిగిన సంఘటనలు ఆవేదన కలిగించాయని తెలిపారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పవన్ కల్యాణ్ తన ప్రకటనలో వెల్లడిరచారు. గాయపడిన వారు త్వరగా కోలుకొనేలా మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.