ఏపీలో నగరపాలక, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. నెల్లూరు కార్పొరేషన్తోపాటు 12 మున్సిపాలిటీలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 353 స్థానాల్లో 28 వార్డులు ఏకగ్రీవం కాగా మిగతావాటికి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత, నిఘా, పర్యవేక్షణ జరపాలని అన్ని జిల్లాల అధికారులను ఎస్ఈసీ నీలం సాహ్నీ ఆదేశించారు. ఎన్నికల కోసం ఈ నెల 1న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ సహా నోటిఫికేషన్ జారీ చేయగా ఇవాళ పోలింగ్ జరగుతోంది. మొత్తం 8 లక్షల 62వేల మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అన్ని స్థానాలకు కలిపి 1,206 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సోమవారం జరుగుతున్న ఎన్నికలపై మొత్తం 908 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా 349 ప్రాంతాలను సున్నితమైనవిగా, 239 కేంద్రాలను అతి సున్నితమైనవిగా గుర్తించారు. 626 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్కు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల అధికారులు ఆదేశించారు.