న్యూదిల్లీ: చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ అధిపతిగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా వేసింది. సస్పెన్షన్ ఎంతకాలం కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్ చేయకూడదన్న నిబంధనలు గమనించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన నిర్దేశాలు కోరామని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. సస్పెన్షన్ను కొనసాగించేందుకు నిర్దేశాలు కోరినట్లు న్యాయవాది చెప్పారు. రెండేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశాలు అడుగుతారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రేపటి(శుక్రవారం)లోగా అన్ని వివరాలతో రావాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ కొనసాగించాలన్న వాదనలకు ఆధారాలు చూపాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఎల్పీపై జోక్యానికి ఆధారాలు కనిపించడం లేదని ధర్మాసనం పేర్కొంది. రేపటి తర్వాత విచారణ వాయిదా వేయడం కుదరబోదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం తెప్పించుకోవాల్సిందేనని అధికారులను ఆదేశించింది.