జాస్తి కృష్ణ కిషోర్పై ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసు కొట్టివేత
ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ పై ఏపీ ప్రభుత్వం గతంలో నమోదు చేసిన కేసును ఏపీ హైకోర్టు కొట్టివేసింది. కృష్ణ కిషోర్ పై జగన్ సర్కారు పెట్టిన కేసు అక్రమమే అని న్యాయస్థానం తేల్చింది. ఈడీబీ, సీఈఓగా కృష్ణ కిషోర్ ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు సీనియర్ ఐటీ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ పై జగన్ సర్కారు పెట్టిన కేసును ఏపీ హైకోర్టు కొట్టివేసింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నాడు రాష్ట్ర సర్వీసుల్లో ఉన్న కృష్ణ కిషోర్ను సస్పెండ్ చెయ్యడమే కాకుండా క్రిమినల్ సెక్షన్ల కింద ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అయితే, తన సస్పెన్షన్ పై కృష్ణ కిషోర్ క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్) ను ఆశ్రయించగా, ఆ ఉత్తర్వులపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది.అనంతరం కృష్ణ కిషోర్ పై సస్పెన్షన్ చెల్లదని జస్టిస్ నరసింహారెడ్డి అధ్యక్షతన విచారణ జరిపిన క్యాట్ హైదరాబాద్ బెంచ్ తుది తీర్పు ఇచ్చింది. అనంతరం కృష్ణ కిషోర్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆ కేసులో పెట్టిన సెక్షన్ లు చెల్లవని కేసును క్వాష్ చేసింది. కృష్ణ కిషోర్ వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు గాని, లాభ పడినట్లు గాని ఎక్కడా అధారాలు లేవని తేల్చి చెప్పింది. అంతే కాకుండా సీఎం జగన్ పై కేసులను దర్యాప్తు చేసిన నాటి సీబీఐ అధికారి లక్ష్మీనారాయణతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే కారణంగా, దురుద్దేశపూర్వకంగా కృష్ణ కిషోర్ పై కేసు పెట్టినట్లు హైకోర్టు నిర్థారణకు వచ్చింది. భజన్ లాల్ కేసులో సుప్రీం కోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కేసు కొట్టి వేయదగినదిగా హైకోర్టు భావించింది.