అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళా ఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది. పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి రానున్న 12 గంటల్లో వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక అనంతరం 24 గంటల తర్వా వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముందని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెబుతున్నాయి.గతకొన్ని రోజుల క్రితం వచ్చిన తుపాన్ కారణంగా రాయలసీమ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా మరిచిపోకముందే ఇప్పుడు జవాద్ తుపాన్ ఏపీవైపు దూసుకొస్తోంది. ఈ తుపాన్ కారణంగా ఉత్తరాంధ్రకు పెను ముప్పు పొంచి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఇవాళ ఉత్తరాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. శనివారం ఉత్తరాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడిరచారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్య్సకారులు సోమవారం వరకు చేపటవేటకు వెళ్లరాదని హెచ్చరించారు.