ఏపీలో 1.16 కోట్ల మంది మహిళలు ‘దిశ’ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని సీఎం జగన్ చెప్పారు. ఈ యాప్ ద్వారా మహిళలకు వేగంగా రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. 163 దిశ పోలీస్ పెట్రోలింగ్ వాహనాలతోపాటు బందోబస్తు సమయాల్లో మహిళా పోలీసులకు సౌకర్యంగా ఉండేలా 18 కారవాన్లను సచివాలయం మెయిన్గేట్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, మహిళలపై అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదని అన్నారు. ఇప్పటికే దిశ పోలీస్స్టేషన్లలో 900 ద్విచక్రవాహనాలున్నాయి. వీటితో పాటు 3 వేలకు పైగా ఎమర్జెన్సీ వాహనాలను ప్రారంభిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. కాగా, ఈ దిశ పెట్రోలింగ్ వాహనాలు జీపీఎస్ ద్వారా కంట్రోల్ రూమ్కి అనుసంధానమై ఉంటాయి. ఇప్పటికే దిశ పోలీస్ స్టేషన్ల పరిధిలో 900 ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉంచారు. ఏదైనా ప్రమాదం జరిగితే పట్టణాల్లో 4-5 నిమిషాల్లో, గ్రామాల్లో 8-10 నిమిషాల్లో దిశ సిబ్బంది స్పందించనున్నారు. మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా విశ్రాంతి గదులు ఏర్పాటు చేశారు. దిశ పెట్రోలింగ్ వాహనాలకు రూ. 13.85 కోట్లు, రెస్ట్ రూమ్స్కి రూ. 5.5 కోట్లు ఖర్చు చేశారు.