మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి బాధాకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. రోశయ్య కుటుంబసభ్యులకు మంత్రి కేటీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రజాజీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేత అని మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. రోశయ్య మృతిపట్ల చిరంజీవి ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడటంలో ఓ రుషి మాదిరిగా సేవ చేశారని చిరంజీవి పేర్కొన్నారు. రోశయ్య కన్నుమూయడంతో రాజకీయాలలో ఓ శకం ముగిసిందన్నారు.
మాజీ సీఎం రోశయ్య రాజకీయాల్లో అజాత శత్రువుగా ముద్రవేసుకున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. రోశయ్య మృతి అత్యంత బాధాకరమని, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు.
రోశయ్య మృతిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విచారం వ్యక్తంచేశారు. రోశయ్య జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలన్నారు. నీతి నిజాయితీ, నిబద్ధత, ప్రజా సేవ పట్ల అంకితభావం, సిద్ధాంతాల ఆచరణలో రోశయ్య పేట్టింది పేరని రేవంత్ కొనియాడారు.
రోశయ్య కుమారుడితో ఫోన్లో మాట్లాడిన రాహుల్గాంధీ
మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ మేరకు రోశయ్య కుమారుడు శివతో రాహుల్ ఫోన్లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి రోశయ్యకు ఉన్న అనుబంధాన్ని కాంగ్రెస్ నేత గుర్తు చేసుకున్నారు. ఆపై కేవీపీ రామచందర్ రావ్తో రాహుల్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా రోశయ్య మృతి వివరాలను రాహుల్కు కేవీపీ వివరించారు.