హైదరాబాద్ : ఇటీవల కాలంలో చలనచిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా తెలుగులో చాలా మంది ముఖ్యులు కన్నుమూశారు. తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. యువ దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్(31) హఠాన్మరణం చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించారు. జోసెఫ్ మరణంతో మాలీవుడ్లో విషాదఛాయలు అలుము కున్నాయి. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం నాన్సీ రాణి షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది ఇంతలోనే దర్శకుడు మరణించడంతో చిత్ర బృందం షాక్కి గురైంది. జోసెఫ్ మరణంపై సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. జోసెఫ్ మను జేమ్స్ బాలనటుడిగానూ నటించి అలరించారు. గతంలో ఆయన ఐ యామ్ క్యూరియస్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. 2004లో ఈ సినిమా విడుదలై ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆయన కొన్ని మలయాళ, హిందీ, కన్నడ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఇప్పుడు నాన్సీ రాణి చిత్రంతో దర్శకుడిగా మారాడు. తొలి చిత్రాన్ని థియేటర్లలో చూసుకోవాలని కలలు కన్న ఆ దర్శకుడు, తన సినిమాని తానే చూసుకోలేకపోవడం అత్యంత బాధాకరం.