Friday, April 26, 2024
Friday, April 26, 2024

వేడెక్కిన ముంబై

శివసేన రాజకీయాలు ఎక్కడ మొదలైనాయో అక్కడే సమాధి చేస్తాం అని సవాలు విసిరారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. ఈ సవాలును ఎదుర్కోవడానికి తాము సిద్ధం అని జవాబిచ్చారు శివ సేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే. త్వరలో బృహన్ముంబై నగర పాలక సంస్థ (బి.ఎం.సి.) ఎన్నికలు జరగనున్నాయి. లోకసభ లేదా శాసనసభ ఎన్నికలు శివసేనకు అంత ప్రధానం కాదు. శివసేన చీలిక వర్గం నాయకుడు ఏక్‌ నాథ్‌ షిండే శివసేనను చీల్చి ఉద్ధవ్‌ ఠాక్రేను గద్దె దింపి బీజేపీతో పొత్తు కూడి ఆ పీఠంపై అధిష్టించారు. బృహన్ముంబై ఎన్నికలలో కూడా బీజేపీతో కలిసి పోటీ చేస్తామని షిండే అంటు న్నారు. ఎన్నికల ముందు ఈ అంశంతో పాటు మరో వివాదం కూడా రేకెత్తింది. బాలాసాహెబ్‌ ఠాక్రే 1966లో శివసేన ఏర్పాటు చేశారు. చాలా కాలం శివసేన మహారాష్ట్ర మహారాష్ట్రీయుల కోసమే అన్న ఉద్యమం సాగిం చింది తప్ప ఎన్నికల గోదాలోకి దిగలేదు. దిగినా అది ముంబైకే పరిమితం. సుదీర్ఘ కాలం నుంచి శివసేన ముంబై మీద ఆధిపత్యం చెలాయిస్తోంది. ఠాక్రే అధినేతగా ఉన్నప్పటి నుంచీ, ఆ తరవాత ఆ కుటుంబమే శివసేనను నడుపుతోంది. శివ సేన సైతం వీర హిందుత్వ వాదే. కానీ బీజేపీతో బెడిసి పోయిన తరవాత ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వంలోని శివసేన కాంగ్రెస్‌, నేషన లిస్టు కాంగ్రెస్‌ కలిసి మొన్న మొన్నటి దాకా మహారాష్ట్రలో అధికారంలో ఉంది. ఎవరైనా పరాజితులైతే ఆ పక్షానికి బాధ కలుగుతుంది. కానీ వారి సొంత గడ్డ మీద అపజయం ఎదురైతే ఆ బాధ వర్ణనాతీతం అంటున్నారు అమిత్‌ షా. ఆ బాధ ఎలా ఉంటుందో శివసేనకు చూపిస్తామంటున్నా రాయన. ఒక వేళ అదే నిజమైతే శివసేన అస్తిత్వానికే ముప్పు రావచ్చు. బృహన్ముంబైలోని 227 సీట్లలో తాము 150 సాధిస్తామని బీజేపీ గర్జిస్తోంది. అలాగే జరిగితే ఉద్ధవ్‌ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడ్డట్టే. కానీ శివసేన దృక్కోణంలోంచి చూస్తే బి.ఎం.సి. ఎన్నికలే శివసేనకు జీవన్మరణ సమస్య. 1968 బృహన్ముంబై ఎన్నికలలో శివసేనకు ఓటు వేసిన వారు ప్రధానంగా మహారాష్ట్రీయులే. అయితే శివసేన ఎంతగా ఈసడిరచినా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ముంబైలో పని చేసుకుంటున్న రోజు కూలీలు, ఉద్యోగులు కూడా శివసేనకు మద్దతిచ్చారు. బాలా సాహెబ్‌ ఠాక్రే నాయకత్వంలో కూడా ఉన్నత ఆదాయ వర్గాలు, మహారాష్ట్రలో ఉంటున్న గుజరాతీలు శివసేనకు మద్దతివ్వలేదు. దిల్లిలో ఇప్పుడు పెత్తనం చేస్తున్నది గుజరాతీలే కనక ఏక్‌ నాథ్‌ షిండే చీలిక వర్గం, బీజేపీతో కూడిన ఐక్య సంఘటనకు గుజరాతీల మద్దతు సమకూర వచ్చు. 1985 నాటికి బాలాసాహెబ్‌ ఠాక్రే శివసేనను పూర్తి హిందుత్వ పార్టీగా మార్చేశారు. ముస్లింలను ద్వేషించడం ప్రారంభించారు. 1995లో మహారాష్ట్రలో శివసేనకు అధికారం దక్కినా ఠాక్రే ముఖ్యమంత్రి కాలేదు. మనోహర్‌ జోషీని ముఖ్యమంత్రిని చేశారు. ఆయనను నడిపించింది మాత్రం బాలా సాహెబ్‌ ఠాక్రేనే. అప్పుడూ బీజేపీతో పొత్తు ఉంది. బాలా సాహెబ్‌ ఆ దశలో విద్వేషం బహిరంగానే వ్యక్తం చేసేవారు. నాయకులను రోడ్డుకీడ్చి కొట్టే దశ వస్తుందన్నారు. దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా ఈసడిరచేవారు. మొదట శివసేన ఒక ముఠాలా వ్యవహరించింది. ఆ తరవాత సంస్థాపరంగా ఎదిగింది. ఆ తరవాత ఉద్యమబాట పట్టింది. అప్పుడు గానీ అధికారం రుచి మరగలేదు.
బాలా సాహెబ్‌ రంగం మీంచి వైదొలగిన తరవాత రాజ్‌ ఠాక్రే మహా రాష్ట్ర నవనిర్మాణ సేన (ఎం.ఎన్‌.ఎస్‌.) నెలకొల్పారు. ఆ తరవాత ఆయన ఎన్నికలలో పెద్దగా ప్రభావం చూపకపోయినా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ముంబైలో శివసేనను ఓడిస్తే తప్ప మహారాష్ట్రలో అధికారం దక్కదని అమిత్‌ షా మంగళవారం ముంబైలోనే అన్నారు. అంటే బి.ఎం.సి. ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు దారి చూపుతాయనుకోవాలి. శివ సేన అంతు చూడాలని ముఖ్యమంత్రి షిండేకు అమిత్‌ షా శషభిషలు లేకుం డానే చెప్పేశారు. శివసేన రంగంలో ఉంటే హిందువుల ఓట్లన్నీ మనకు దక్కవని కూడా హితవు చెప్పారు. ముఖ్యమంత్రి పదవి చేతిలో లేకపోతే బీజేపీ శివసేనను అంతం చేస్తుందని ఉద్ధవ్‌ ఠాక్రే గ్రహించారు కనక శివ సేనతో విడిపోయి కాంగ్రెస్‌, నేషనలిస్టు కాంగ్రెస్‌తో పొత్తు కూడి ముఖ్య మంత్రి అయ్యారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఉద్ధవ్‌ ఠాక్రే దగ్గర లేదు. బి.ఎం.సి. లో అధికారం లేకపోతే ఏ పక్షానికైనా మహారాష్ట్ర మీద ఆధి పత్యం దక్కదు. అందుకే ఎట్టి పరిస్థితిలోనూ శివసేనను బి.ఎం.సి. ఎన్ని కలలో గెలవనివ్వకూడదన్నది అమిత్‌ షా పంతం. ముంబై ఆర్థిక శక్తికి కేంద్రం. అక్కడ అధికారంలో ఉంటే తప్ప కార్పొరేట్‌ సంస్థలు గుప్పెట్లో ఉండవు. శివసేన పటిష్ఠంగా ఉన్నంత కాలం ఆర్‌.ఎస్‌.ఎస్‌. కూడా కిమ్మన లేదు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కనక ఆర్‌.ఎస్‌.ఎస్‌. కీలక పాత్ర పోషిస్తుంది. బి.ఎం.సి. ఎన్నికలు శివసేనకు చివరి పరీక్ష లాంటివే. అరవై ఏళ్ల చరిత్రలో శివసేన ఇంత సంకట స్థితిలో ఎప్పుడూ పడలేదు. ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు దగ్గరపడిన దశలో, ముఖ్యంగా అమిత్‌ షా సవాలు విసిరిన తరవాత మళ్లీ మరాఠీ ఆత్మ గౌరవం చర్చనీయాంశం అవుతోంది. దుకాణాలు, హోటళ్లు, బార్లు, సినిమా హాళ్ల వంటి సంస్థలు మొదలైనవాటి సైన్‌ బోర్డులన్నీ మరాఠీలో ప్రముఖంగా ఉండాలని తాజాగా గత మంగళవారం బి.ఎం.సి. ఉత్తర్వు జారీ చేసింది. 2017 నాటి దుకాణాలు తదితర వ్యవస్థల చట్టాన్ని ఈ మేరకు సవరిం చారు. ఒక వేళ ఈ ఉత్తర్వులకు కట్టుబడకపోతే చట్ట పరంగా చర్య తీసు కుంటామని కూడా హెచ్చరించారు. మిగతా భాషల్లో పేర్లు రాసినా మరా ఠీలో రాసే పేరు పెద్దక్షరాల్లో ఉండాలని ఆదేశించారు. డేవనాగరిలో రాసే దుకాణం పేరు కూడా ప్రధానంగా కనిపించాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సైతం ఈ నిబంధనకు కట్టుబడి ఉండాల్సిందే. విశ్వవిద్యాలయాలకు, అనుబంధ కళాశాలలకూ ఇది వర్తిస్తుంది. ఒకటవ తరగతి నుంచి పదో తరగతి దాకా మరాఠీ భాషా బోధనను 2020 ఫిబ్ర వరి నుంచి తప్పనిసరి చేశారు. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లూ ఈ పని చేయాల్సిందే. శివసేన, ఎం.ఎన్‌.ఎస్‌. మరాఠీ భాష వాడకాన్ని రాజకీయాం శంగా మార్చేశాయి. పాతికేళ్లుగా బి.ఎం.సి. శివసేన ఆధిపత్యంలోనే ఉంది. దాని కాలపరిమితి గత మార్చిలో తీరిపోయిన తరవాత ప్రత్యేకాధికారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2008లో రాజ్‌ ఠాక్రే నాయకత్వంలోని ఎం. ఎన్‌.ఎస్‌. సైన్‌ బోర్డులన్నీ మరాఠీ భాషల్లో ఉండాలని ఆందోళన లేవ దీసింది. ప్రభుత్వ ఉత్తర్వులూ జారీ అయ్యాయి. అయితే బొంబాయి హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వును ఉపసంహరించారు. మరాఠీలో సైన్‌ బోర్డులు రాయకపోతే గుణపాఠం చెప్తామని అప్పుడు ఎం.ఎన్‌.ఎస్‌. హెచ్చరించింది. 2017లో బి.ఎం.సి. ఎన్నికలలలో శివసేన మరాఠీ ఆత్మ గౌరవ ఆందోళనను తెరపైకి తీసుకొచ్చింది. మరాఠీల ఆధిపత్యం కోసం గట్టిగా నిలబడి ఆదిత్య ఠాక్రే శివసేనను బలోపేతం చేయగలరా అన్నదే అసలు ప్రశ్న.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img