శ్రీలంక ఎంపీలు పారిపోయి భారత్కు వచ్చినట్లు వార్తలు రావడంపై స్పందించిన భారత హైకమిషన్
శ్రీలంకలో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొనడంతో కొందరు నేతలు ఆ దేశం విడిచి పారిపోయి భారత్కు వస్తున్నట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ కథనాలపై శ్రీలంకలోని భారత హైకమిషన్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ…‘శ్రీలంకకు చెందిన కొందరు రాజకీయ నేతలు వారి కుటుంబాలతో సహా భారత్కు పొరిపోతున్నారని కొన్ని మీడియా, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుపుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇవన్నీ నిరాధార అవాస్తవమైన కథనాలు. వీటిని హైకమిషన్ తీవ్రంగా ఖండిస్తోంది.’ అని పేర్కొంది. మరోవైపు, శ్రీలంకలో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఆర్థిక, ఆహార సంక్షోభానికి బాధ్యత వహిస్తూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మహింద రాజపక్స ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మహిందపై దాడి చేసేందుకు కొలంబోలోని ప్రధానమంత్రి అధికార నివాసం టెంపుల్ ట్రీస్కు నిన్న పెద్ద ఎత్తున ఆందోళనకారులు చేరుకుని, అక్కడి వాహనాలను తగలబెట్టారు. అనంతరం భవనం లోపలికి చొరబడేందుకు ప్రయత్నించడంతో వారిపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. అలాగే, నిన్న కట్టుదిట్టమైన భద్రత నడుమ మహీందతో పాటు ఆయన కుటుంబ సభ్యులను మరో ప్రాంతానికి తరలించారు. ఈ క్రమంలో మహింద కుటుంబం ట్రింకోమలీ నౌకాదళ స్థావరం వద్ద ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. మరోపక్క, కొందరు ఎంపీలు దేశం విడిచి వెళ్తున్నట్లు కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. దీంతో ఎంపీలు దేశం విడిచి వెళ్లకూడదంటూ వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు ఆందోళనలు చేస్తున్నారు. కొలంబోలోని బండారునాయికె విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ఆందోళన కారులు స్వయంగా చెక్ పాయింట్ను ఏర్పాటుచేసి తనిఖీలు చేస్తుండడం గమనార్హం.