. సీబీఐ కేసుల కొట్టివేతతో మార్గం సుగమం
. రేసులో నీరబ్, జవహర్, పూనం మాలకొండయ్య
. నెలాఖరుకు సమీర్ శర్మ పదవీకాలం పూర్తి
. సీఎం జగన్ నిర్ణయంపై ఐఏఎస్ల్లో చర్చ
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:
రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ పదవీకాలం నెలాఖరుతో ముగియనుంది. దీంతో డిసెంబరు 1వ తేదీ నుంచి కొత్త సీఎస్గా ఎవరు రాబోతున్నారనే దానిపై అధికారుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఐఏఎస్ల్లో కొత్త సీఎస్ ఎవరనేదానిపై విశ్లేషణలు జోరందుకున్నాయి. ఆశావహుల్లో 1988 బ్యాచ్కి చెందిన ఎర్రా శ్రీలక్ష్మి, పూనం మాలకొండయ్య, జవహర్రెడ్డి పేర్లు ప్రముఖంగా వినపడుతు న్నాయి. వీరిలో శ్రీలక్ష్మికే అవకాశాలు మెండుగా ఉన్నాయని అధికారపార్టీ నేతలతో పాటు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై నమోదైన అక్రమాస్తుల కేసులో శ్రీలక్ష్మీ నిందితు రాలిగా ఉన్నారు. ఆమె జగన్తో పాటు చంచల్గూడ జైలులో కొంత కాలం ఉన్నారు. దీంతో శ్రీలక్ష్మిపై ముఖ్యమంత్రికి ప్రత్యేక సానుభూతి ఉందని చెపుతున్నారు. అందుకే తెలంగాణ కేడర్కు చెందిన శ్రీలక్ష్మిని సీఎం జగన్ పట్టుబట్టి ఏపీకి తీసుకొచ్చారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంపైనా సీఎం గట్టి ఒత్తిడే తీసుకొచ్చారు. శ్రీలక్ష్మి ఏపీకి బదిలీ అయిన తర్వాత వెంట వెంటనే పదోన్నతులు కల్పించడంతో పాటు కీలకశాఖల బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆమె పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కీలక సమావేశాల్లోనూ సీఎం ఆమెకు ప్రాధాన్యత నిస్తున్నారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి స్థాయికి ఎదగాల్సిన శ్రీలక్ష్మికి సీబీఐ కేసులు ఇబ్బంది కలిగించాయన్న సానుభూతి సీఎంకు ఉంది. ఆ బాధ ఆమెలో తొలగించాలన్న భావనతో సీఎం ఉన్నారని, ఆ విధంగా చూస్తే శ్రీలక్ష్మికి సీఎస్ అయ్యే అవకాశం మెండుగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీనికితోడు ఆమెపై సీబీఐ నమోదు చేసిన కేసులు, అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో శ్రీలక్ష్మికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ సమీర్శర్మ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఇప్పటికే ఆయన పదవీకాలం ఒకసారి పొడిగించినందున ఇకపై పొడిగింపు అవకాశాలు లేనట్లే. శ్రీలక్ష్మి కంటే ముందు అంటే 1987 బ్యాచ్కు చెందిన నీరబ్కుమార్ ప్రసాద్తో పాటు 1988 బ్యాచ్కు చెందిన పూనం మాలకొండయ్య, ఎ.గిరిధర్, 1990 బ్యాచ్కు చెందిన జవహర్ రెడ్డి కూడా సీఎస్ రేసులో ఉన్నారు. అటవీ, పర్యా వరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా జవహర్ రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్గా పూనం మాలకొండయ్య కీలక బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, గిరిధర్ కేంద్ర సర్వీ సులో ఉన్నారు. వీరిలో శ్రీలక్ష్మి తర్వాత జవహర్ రెడ్డికి సీఎం ప్రాధాన్యతనిస్తున్నట్లు ప్రచారం సాగు తోంది. ఆయనను ఇప్పటికే సీఎంవోలో నియమిం చుకున్నందున జవహర్ రెడ్డికి కూడా అవకాశం లేకపోలేదని చెపుతున్నారు. అయితే శ్రీలక్ష్మి అతని కంటే సీనియర్ కావడం, ముఖ్యమంత్రికి ఆమెపై ప్రత్యేక సానుభూతి ఉండటంతో నూటికి నూరు శాతం కొత్త సీఎస్ పదవి శ్రీలక్ష్మినే వరిస్తుందని సీనియర్ ఐఏఎస్లు స్పష్టం చేస్తున్నారు. డిప్యుటేషన్పై తెలంగాణ నుండి ఏపీకి శ్రీలక్ష్మి వచ్చిన లక్ష్యం కూడా అదేనని పేర్కొంటున్నారు.