లక్నో: నరేంద్రమోదీ ప్రభుత్వంపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. వంటగ్యాస్ ధరను భారీగా పెంచడంపై ఆగ్రహం వెలిబుచ్చారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం పాలక బీజేపీ దేశ ప్రజలకు ఇచ్చిన గొప్ప కానుక ఇదని అఖిలేశ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతారని తాము ముందే హెచ్చరించామని ఆయన గుర్తుచేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి పెట్రో ధరల రోజువారీ పెంపును మోదీ ప్రభుత్వం నిలిపివేసిన విషయం విదితమే. నాలుగున్నర నెలల తర్వాత మళ్లీ బాదుడు మొదలుపెట్టింది. పెట్రోలు, డీజిలు ధర లీటరుకు 80 పైసలు, వంటగ్యాస్ ధర సిలిండర్కు రూ.50 పెంచిన విషయం విదితమే. ‘బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన మరో గొప్ప బహుమతి ఇది. లక్నోలో సిలిండర్ ధర రూ.1000కి చేరింది. పాట్నాలోనూ రూ.1000. ఎన్నికలు పూర్తయ్యాయి. బాదుడు ప్రారంభమైంది’ అని అఖిలేశ్ మంగళవారం ట్వీట్ చేశారు.