న్యూదిల్లీ : 5జీ సేవలకు సంబంధించి రిలయన్స్ కీలక ప్రకటన చేసింది. దీపావళి కానుకగా 5జీ సేవలను అందుబా టులోకి తీసుకొస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ను అందించేందుకు రిలయన్స్ కట్టుబడి ఉందని ముకేశ్ అంబానీ అన్నారు. ఇందుకోసం రూ.2లక్షల కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. దీపావళి నాటికి దిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా సహా కీలక నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. 2023 డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి పట్టణం, ప్రతి మండలంలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. 5జీ సొల్యూషన్స్ కోసం క్వాల్కామ్తో జట్టు కట్టినట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. 5జీ స్మార్ట్ఫోన్, గూగుల్ క్లౌడ్ కోసం గూగుల్తో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. ఫైబర్ నెట్వర్క్లోనూ జియో ముందు వరుసలో ఉందని అంబానీ తెలిపారు. దేశవ్యాప్తంగా జియో ఫైబర్కు 11 లక్షల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఉందని చెప్పారు.