దేశవ్యాప్తంగా నేటి నుంచి 12-14 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్ అందించనున్నారు.ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ఇప్పటికే ఖరారు చేసింది. ఈ వయసు పిల్లలు ఆంధ్రప్రదేశ్లో 14.50 లక్షలు ఉండగా.. తెలంగాణలో 17.23 లక్షల మంది చిన్నారు ఉన్నారు. అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు పూర్తి చేశాయి. టీకా తీసుకోవాలంటే కోవిడ్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. తల్లిదండ్రుల అకౌంట్ ద్వారా గానీ, లేదా కొత్త అకౌంట్ ద్వారా గానీ పేరును నమోదు చేసుకోవచ్చు. ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకొని టీకా తీసుకోవాలి. ఆన్లైన్ కాకుండా నేరుగా కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి.. అక్కడ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.. మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత.. రెండో డోసు ఇస్తారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో 2021 మార్చి 1 నాటికి 12-13 ఏళ్ల వయసు చిన్నారులు 4.7 కోట్ల మంది ఉన్నారు.. వారందరికీ కరోనా టీకాలు ఇవ్వనున్నారు. మనదేశంలో పెద్దలకు కోవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ టీకాలను వేశారు. ఐతే పిల్లలకు మాత్రం వీటిని కాకుండా.. కార్బివ్యాక్స్ టీకాలను వేస్తారు. హైదరాబాద్కు చెందిన ‘బయాలాజికల్-ఈ’ సంస్థ ఈ టీకాలను తయారుచేసింది.2008, 2009, 2010లో పుట్టిన పిల్లలు (12-14 ఏళ్లు) కు మాత్రమే టీకాలను వేస్తారు. పిల్లలతో పాటు 60 ఏళ్లు పైబడినవాళ్లకు కూడా మూడో డోసును (బూస్టర్ డోస్) వేస్తారు. రెండో డోసు తీసుకొని 9 నెలల పూర్తయిన వారికి మాత్రమే బూస్టర్ డోస్ ఇస్తారు. మొదటి రెండు డోసులు ఏ టీకా తీసుకున్నారో.. మూడో డోసు కూడా అదే టీకాలు తీసుకోవాల్సి ఉంటుంది.