Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పెట్రో భారం మనకేనా!

అమెరికా, చైనా, పాకిస్థాన్‌, శ్రీలంక కంటే ధర ఎక్కువ
పాలకులు ఇంధనంపై పన్నులు తగ్గించాల్సిన సందర్భమిది
బ్రిటన్‌, జర్మనీలో కంటే తక్కువ బ బీవోబీ పరిశోధన నివేదిక వెల్లడి

న్యూదిల్లీ : దేశంలో పెట్రో ఉత్పత్తుల అధిక ధరల భారంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరల మంటతో ఇప్పటికే కూరగాయల నుంచి నిత్యావసర వస్తువులు, ఇతర అన్ని తయారీ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడి వాటి ధరలన్నీ ఆకాశాన్నంటాయి. అయితే పెట్రో ఉత్పత్తుల ధరలను కట్టడి చేయవలసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్‌ ధరను భారత్‌లోని ధరతో పోల్చి చూస్తే అధిక వ్యత్యాసం కనిపిస్తోంది. దీనికి సంబంధించి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) పరిశోధన నివేదిక ఈ విషయాన్ని వెల్లడిరచింది. హాంకాంగ్‌, జర్మనీ, బ్రిటన్‌ వంటి దేశాల కంటే భారత్‌లో పెట్రోల్‌ ధర తక్కువే. కానీ చైనా, బ్రెజిల్‌, జపాన్‌, అమెరికా, రష్యా, పొరుగు దేశాలయిన పాకిస్థాన్‌, శ్రీలంక కంటే అధికంగా ఉంది. భారతదేశంలో పెరుగుతున్న ఇంధన ధరలను అదుపులో ఉంచడానికి కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వమూ తమ పన్నులను తగ్గించాలనే దానిపై గణనీయ మైన చర్చకు దారితీసింది. అంతర్జాతీయంగా ముడి చమురు (పెట్రోల్‌, డీజిల్‌ తయారీకి ముడి సరుకు) ధరలు పెరగడం వల్ల ఇంధన ధరల పెరుగుదల ప్రధానంగా ఉంది. ఇంకా డాలర్‌ విలువ పెరగడం కూడా దీనికి తోడయింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఆర్థిక పరిశోధన నివేదిక మే 9 నాటికి వివిధ దేశాల్లో తలసరి ఆదాయంతో పెట్రోల్‌ ధరలను జత చేసింది. ‘వివరాలు అందుబాటులో ఉన్న 106 దేశాలను పరిశీలిస్తే, భారతదేశంలో లీటరుకు 1.35 డాలర్ల ధర ర్యాంక్‌లో 42వ స్థానంలో ఉంది. అందు చేత ధర ఎక్కువగా ఉన్న దేశాలు 50కి పైగా ఉన్నాయి. ఇక మధ్యస్థ ధర లీటరుకు 1.22 డాలర్లుగా ఉంది’ అని పేర్కొంది. భారతదేశంలో ఇంధన ధరలు ఆస్ట్రేలియా, టర్కీ, దక్షిణ కొరియాతో సమానంగా ఉన్నాయి. ఇది హాంకాంగ్‌, ఫిన్లాండ్‌, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్‌, గ్రీస్‌, ఫ్రాన్స్‌, పోర్చుగల్‌, నార్వే కంటే తక్కువగా ఉంది. ఇక్కడ లీటరుకు ధర 2 డాలర్ల కంటే ఎక్కువ ఉంది. పోల్చదగిన దేశాలలో (తలసరి వారీగా), వియత్నాం, కెన్యా, ఉక్రెయిన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, వెనిజులా దేశాల కంటే భారత్‌లో ధరలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధాన చమురు ఉత్పత్తి చేసే దేశాలు చాలా తక్కువ ధరలను కలిగి ఉన్నాయి. ‘తలసరి ఆదాయంతో పోల్చినప్పుడు ధరలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో అక్కడ తలసరి ఆదాయం భారతదేశంలో కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు చూడవచ్చు. అందువలన ద్రవ్యోల్బణంపై దాని ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం ఎక్కువగా ఉన్నందున తక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలకు ఆర్థిక భారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తక్కువ ఆదాయ వర్గాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది’ అని నివేదిక పేర్కొంది. నివేదికలో ఫిలిప్పీన్స్‌ పోల్చదగిన పెట్రోల్‌ ధరను కలిగి ఉంది. అయితే తలసరి ఆదాయం భారతదేశం కంటే 50 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఇక తలసరి ఆదాయం తక్కువగా ఉన్న కెన్యా, బంగ్లాదేశ్‌, నేపాల్‌, పాకిస్తాన్‌, వెనిజులా వంటి దేశాల్లో పెట్రోల్‌ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. భారతదేశం కంటే తక్కువ ప్రభావం చూపుతుంది. ‘అందువల్ల ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఇంధనంపై పన్నులను తగ్గించడాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవలసిన బలమైన సందర్భం ఇంకా ఉంది’ అని నివేదిక వాదించింది. భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు వినియోగం, దిగుమతి దేశం. ఇది తన చమురు అవసరాలలో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఫలితంగా ధరలు దిగుమతి సమాన రేట్ల వద్ద ఇంధనాన్ని రిటైల్‌ చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడంతో భారత్‌లోని చమురు కంపెనీలకు పెట్రోల్‌, డీజిల్‌, ఇతర పెట్రో ఉత్పత్తుల ఉత్పత్తి ఖర్చు కూడా పెరిగింది. మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే పక్షం రోజుల వ్యవధిలోనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను లీటరుకు రూ.10 చొప్పున పెంచేసింది. అయితే ఈ చర్య విమర్శలను ఎదుర్కోవడంతో కొంత వెనుకంజ వేసింది. బదులుగా పన్నులను తగ్గించాలని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాలనే అభ్యర్ధనలను పట్టించుకోలేదు. దానికి బదులుగా సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించడానికి వ్యాట్‌ లేదా అమ్మకపు పన్నును తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
దేశ రాజధాని న్యూదిల్లీలో ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.41 కాగా, డీజిల్‌ ధర లీటరుకు రూ.96.67గా ఉంది. హాంకాంగ్‌లో లీటరుకు 2.58 డాలర్ల వద్ద పెట్రోల్‌ ధర ఖరీదైనదిగా ఉండగా, మలేసియాలో 47 సెంట్లతో చౌకగా లభ్యమవుతోంది. జర్మనీలో లీటరుకు 2.29 డాలర్లు, ఇటలీలో 2.28 డాలర్లు, ఫ్రాన్స్‌లో 2.07 డాలర్లు, ఇజ్రాయెల్‌లో 1.96 డాలర్లు, బ్రిటన్‌, సింగపూర్‌లో 1.87 డాలర్లు, న్యూజిలాండ్‌లో 1.75 డాలర్లు, ఆస్ట్రేలియాలో లీటరు 1.36 డాలర్లుగా ధర ఉంది. భారత్‌, టర్కీలో పెట్రోల్‌ ధర లీటరుకు ఒకే విధంగా 1.35 డాలర్లుగా ఉంది. అలాగే జపాన్‌లో పెట్రోల్‌ లీటరు ధర 1.25 డాలర్లుకు చౌకగా ఉంది. చైనాలో లీటరుకు 1.21 డాలర్లు వద్ద ఇంకా తక్కువ రేటును కలిగి ఉంది. అయితే అమెరికాలో లీటరుకు 98 సెంట్లు వద్ద ఇప్పటికీ చౌకగా ఉంది. భారతదేశం పొరుగు దేశాల్లో పెట్రోల్‌ ధర చాలా తక్కువగా ఉంది. బంగ్లాదేశ్‌లో పెట్రోల్‌ లీటరు ధర 1.05 డాలర్లు, పాకిస్తాన్‌లో 77 సెంట్లు, శ్రీలంకలో లీటరుకు 67 సెంట్లుగా ఉన్నట్లు బీవోబీ నివేదిక తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img