విశాలాంధ్ర బ్యూరో` అమరావతి :
ఏపీలో ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం అభ్యర్థులను ప్రకటించింది. ప్రస్తుతం పార్లమెంటరీ నేతగా వ్యవహరిస్తున్న వి.విజయసాయిరెడ్డికి మరో అవకాశం కల్పించారు. అలాగే రెడ్డి సామాజికవర్గానికి చెందిన సీఎం జగన్ వ్యక్తిగత న్యాయవాది, నిర్మాత అయిన నిరంజన్ రెడ్డికి అభ్యర్థిత్వం ఖరారు చేశారు. ఆయన తెలంగాణ రాష్ట్రం నిర్మల్లో జన్మించారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీకున్న బీసీ ఓటు బ్యాంక్ను కొల్లగొట్టే ప్రయత్నంలో భాగంగా వెనుకబడిన వర్గాలకు రెండు సీట్లు కేటాయించారు.
దానిలో ఒకటి తెలంగాణకు చెందిన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు కేటాయించగా, మరో సీటు 2019 ఎన్నికల అనంతరం టీడీపీ నుంచి వలస వచ్చిన నెల్లూరు జిల్లా నేత బీద మస్తాన్రావుకు కేటాయించారు.