Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రతి పైసా చెల్లిస్తాం

అగ్రిగోల్డ్‌ ఆస్తులన్నీ కష్టజీవుల సొమ్ము
అందుకే మానవత్వంతో ముందుకొచ్చాం
రూ.20 వేల లోపు డిపాజిటర్లకు జమ చేసిన సీఎం జగన్‌

అమరావతి : ఎక్కువ వడ్డీ వస్తుందనే ఆశతో అగ్రిగోల్డ్‌ సంస్థలో రూపాయి, రూపాయి దాచుకున్న కష్ట జీవులకు ప్రతి పైసా చెల్లించేందుకు అవసరమైన అన్ని చర్యలూ ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. హైకోర్ట్టు నిర్దేశించిన విధంగా మొత్తం 7 లక్షల పై చిలుకు అర్హులైన అగ్రిగోల్డ్‌ బాధితు లను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుర్తించి, సీఐడీ ద్వారా నిర్ధారించి రూ.666.84 కోట్లను సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మంగళ వారం కంప్యూటర్‌ బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో ముఖ్యమంత్రి జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌ చేసిన లక్షలాది మంది కూలి పనులు చేసుకుంటున్న వారు, తోపుడు బళ్లు, రిక్షా కార్మికులు వంటి చిన్నపాటి వృత్తులు చేసుకునేవారేనన్నారు. ఇలాంటి కష్టజీవులందరినీ కూడా గత ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పి మోసం చేయగా, తాము ఆదుకున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2019 నవంబరులో రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసిన 3.40 లక్షల మందికి కోర్టు ఆమోదించిన జాబితా మేరకు అప్పట్లో రూ.238.73 కోట్లు చెల్లించామని గుర్తు చేశారు. ఆ తర్వాత అర్హులైన ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదన్న నిశ్చయంతో… వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో గతంలో అర్హత ఉండి కూడా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) జాబితాలో మిగిలిపోయిన వారిని కూడా గ్రామ, వార్డు వలంటీర్లు సచివాలయాల వ్యవస్థ ద్వారా ఇంటింటికీ వెళ్లి గుర్తించి మరో 3,86,275 మంది, రూ.10 వేలు లోపు డిపాజిట్‌ చేసిన వారికి కూడా మళ్లీ ఈరోజు చెల్లింపులు చేస్తున్నామన్నారు. ఇందుకోసం మరో రూ.207.61 కోట్లు చెల్లింపులు చేస్తున్నామని వివరించారు. దీంతో పాటు రూ.10 వేల నుంచి 20 వేల లోపు డిపాజిట్‌ చేసి మోసపోయిన దాదాపు 3.14 లక్షల మందికి మరో రూ.459.23 కోట్లు ఇస్తున్నామని సీఎం తెలిపారు. ఇలా మొత్తంగా అక్షరాలా 10.40 లక్షల మందికి రూ.905.57 కోట్లకుపైనే బాధితులకు అందజేశామన్నారు. ఒక ప్రైవేటు కంపెనీ మోసం చేసి ఎగ్గొట్టిన డబ్బును ప్రభు త్వమే బాధ్యతగా తీసుకుని పేద ప్రజలు నష్టపో కుండా ఉండాలని కేవలం మానవత్వంతో చెల్లింపులు చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటి సారి అన్నారు. ఈ మల్టీ స్టేట్‌ స్కాం అనేక రాష్ట్రాలలో విచారణలో, కోర్టుల పరిధిలో ఉన్నందున, దీని వల్ల మన రాష్ట్రంలో ఎవ్వరు నష్టపోయారు? ఎంత నష్టపోయారు? అన్నదాని మీదే ధ్యాసపెట్టామన్నారు. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ ద్వారా అగ్రిగోల్డ్‌ వ్యవహారం కోర్టుల్లో ఒక కొలిక్కి రాగానే వారి భూములను, ఆస్తులను అమ్మించి ప్రభుత్వా నికి రావాల్సిన డబ్బును తీసుకుని, మిగిలిన డబ్బును డిపాజిట్‌ దారులకు చెల్లించే దిశగా చర్యలు తీసుకుంటామని బాధితులకు సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్‌, ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పాముల పుష్పశ్రీవాణి, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్‌ అండ్‌ బి మంత్రి ఎం.శంకరనారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతం సవాంగ్‌, సీఐడీ అడిషనల్‌ డీజీపీ పి.వి.సునీల్‌ కుమార్‌, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img