కరోనా మహమ్మారి బారి నుంచి యావత్ ప్రపంచం ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. త్వరలోనే ఎండెమిక్ దశకు చేరుకోవచ్చన్న నిపుణులు అంచనాలు కాస్త ఊరటనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక వాక్యాలు చేశారు. కరోనా తగ్గుముఖంపడుతున్నప్పటికీ భవిష్యత్తులో మరో మమమ్మారి ప్రపంచంపై విరుచుకుపడే అవకాశముందని హెచ్చరించారు. ఇటీవలే ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిరచిన గేట్స్.. కరోనా లాంటి ముప్పు మరొకటి తప్పదని చెప్పారు. ‘గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచ జనాభాపై తీవ్ర ప్రభావం చూపించింది. అయితే ఇటీవల వ్యాక్సిన్లు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో దాని ఉధృతి తగ్గుముఖంపడుతోంది. ఇప్పటికే చాలామందిలో ఇమ్యూనిటీ స్థాయిలు పెరగడంతో ఒమిక్రాన్ వేరియంట్ను తట్టుకోగలిగాం.అయితే కరోనా ఉధృతి తగ్గుముఖంపడుతున్నప్పటికీ ప్రపంచంపై మరో మహమ్మారి విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది బహుశా కరోనా కుటుంబం నుంచి కాకుండా వేరే వైరస్ నుంచి కావొచ్చు. వృద్ధులు, ఒబెసిటీ, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులపై ఈ మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.’ అని బిల్గేట్స్ హెచ్చరించారు. అయితే వ్యాక్సిన్లతోపాటు కరోనా వైరస్ వల్ల అభివృద్ధి చెందిన యాంటీబాడీల కారణంగా రాబోయే మహమ్మారి నుంచి బయటపడగలమని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు అలాగే వైైద్య రంగంలో నానాటికీ అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కూడా ఈ కొత్త ముప్పును నిలువరించే అవకాశాలున్నాయని అన్నారు. ఇక కరోనా నివారణ కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ లక్ష్యాలపై స్పందించిన గేట్స్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన 70 శాతం మందికి ఈ ఏడాది మధ్య నాటికి వ్యాక్సిన్ అందించే అవకాశాలు అయితే కనిపించడం లేదని సంచలన వ్యాఖ్య చేశారు.