సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
తిరుపతి : పట్టు వదలకుండా తమ సమస్యలపై పోరాటం కొనసాగించి ప్రభుత్వ మెడలు వంచిన బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులను సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అభినందించారు. విద్యార్థుల సమస్యలను సిల్లీ సమస్యలంటూ వ్యాఖ్యానించిన విద్యాశాఖ మంత్రి చేత తమ సమస్యల పరిష్కారం విషయంలో రాత పూర్వ హామీ తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. బాసర విద్యార్థుల పోరాటం ప్రభుత్వానికి ఒక గుణపాఠమని చెప్పారు. ఒక ఉద్యమం మొదలైతే ఆందులోని అంశాలను పరిశీలించకుండా…గుడ్డిగా వ్యతిరేకించి లేనిపోని వ్యాఖ్యానాలు చేస్తూ తప్పించుకోవాలని చూడడాన్ని తప్పుబట్టారు. బాసర విద్యార్థుల సమస్యలను ఇలాగే చూశారని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా పోలీసు క్యాంపులు పెట్టి, మావోయిస్టులు నడుపుతున్నారనే మిషతో అణచివేయాలని చూశారని గుర్తు చేశారు. వాస్తవానికి ఆ విద్యార్థుల సమస్యలు తీర్చలేనివి కాదని పేర్కొన్నారు. బాసర విద్యార్థులు ఆందోళన ప్రారంభించిననాడే పరిష్కారం చూపి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. కానీ మంత్రులు అసమర్థులుగా ఉండడమే సమస్యల పరిష్కారంలో ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. ప్రతి సమస్యను సీఎం కేసీఆర్ చూస్తే తప్ప పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. ఆయన వివిధ పనుల్లో మునిగిపోయిన క్రమంలో సమస్యలు పేరుకుపోతున్నాయని చెప్పారు. సీఎం తప్ప మంత్రివర్గమంతా అసమర్థులైతే ఇటువంటి చెడు ఫలితాలే ఎదురవుతాయనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గమనంలోకి తీసుకోవాలని సూచించారు.