తొలుత రెండుసార్లు పొందినదే మూడో డోసుగా..
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడి
న్యూదిల్లీ : కోవిడ్19 బూస్టర్ డోసుకు సంబంధించి లబ్ధిదారులు కొత్తగా నమోదు చేసుకోవలసిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఫ్రంట్లైన్ కార్మికులకు, అనారోగ్య సమస్యలతో ఉన్న 60 ఏళ్లు పైబడిన వారికి జనవరి 10 నుంచి కోవిడ్
19 బూస్టర్ డోసును అందించనున్నారు. ఇప్పటికే రెండు డోసులు పొందిన అర్హులయిన వారు అపాయింట్మెంట్ లేదా నేరుగా కోవిడ్ వాక్సినేషన్ కేంద్రానికి వచ్చి బూస్టర్ డోసు పొందవచ్చు. ‘శుక్రవారం సాయంత్రం ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభమయిందని, ఆన్సైట్ అపాయింట్మెంట్తో జనవరి 10న టీకా పొందవచ్చు’ అని మంత్రిత్వ శాఖ వివరించింది. అయితే బూస్టర్ డోసుగా గతంలో మొదట ఇచ్చిన రెండు డోసుల వాక్సినే ఉంటుందని కేంద్రం ఇప్పటికే తెలిపింది. ‘తొలుత రెండు డోసులుగా కోవాగ్జిన్ పొందిన వారికి బూస్టర్ డోసుగా కోవాగ్జిన్ టీకానే ఉంటుంది. అలాగే మొదట రెండు డోసులుగా కోవిషీల్డ్ పొందిన వారికి మూడవ డోసుగా కోవిషీల్డ్ టీకానే వేయడం జరుగుతుంది’ అని నీతి ఆయోగ్ ఆరోగ్య సభ్యుడు డాక్టర్ వి.కె.పాల్ బుధవారం తెలిపారు.