Friday, April 26, 2024
Friday, April 26, 2024

బొగ్గు-రైలు-విద్యుత్‌ సంక్షోభాన్ని పరిష్కరించడానికి కేంద్రం ‘పూర్తిగా సిద్ధంగా లేదు’

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి.చిదంబరం
న్యూదిల్లీ : దేశంలో తీవ్ర విద్యుత్‌ అంతరాయాలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి.చిదంబరం విరుచుకుపడ్డారు. పాసింజర్‌ రైళ్లను రద్దు చేయడం, బొగ్గు రేక్‌లను నడపడమే దీనికి ‘సరైన పరిష్కారం’ అని ప్రభుత్వం కనుగొందని అన్నారు. బొగ్గు, రైల్వే, విద్యుత్‌ మంత్రిత్వ శాఖలు తమ ‘భారీ అసమర్థత’ను దాచడానికి నిర్విరామంగా సాకులను కనిపెడుతున్నాయని విమర్శించారు. పెరుగుతున్న ఎండ వేడిమితో డిమాండ్‌ పెరగడంతో వివిధ రాష్ట్రాలు శుక్రవారం విద్యుత్‌ సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో థర్మల్‌ ప్లాంట్‌లలో బొగ్గు కొరత ఉందని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిందించాయి. ఈ విషయంపై చిదంబరం ప్రభుత్వంపై దాడి చేస్తూ, ‘సమృద్ధిగా బొగ్గు, భారీ రైల్వే వ్యవస్థ, థర్మల్‌ ప్లాంట్లలో ఉపయోగించని సామర్థ్యం ఉన్నప్పటికీ, విద్యుత్‌ కొరత తీవ్రంగా ఉంది. మోదీ ప్రభుత్వాన్ని నిందించలేం. 60 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనే కారణం! బొగ్గు, రైల్వే లేదా విద్యుత్‌ మంత్రిత్వ శాఖలలో అసమర్థత లేదు. ఆ శాఖల గత కాంగ్రెస్‌ మంత్రుల పైనే నిందలు మోపారు’ అని ఆయన అన్నారు. ‘ప్రభుత్వం సరైన పరిష్కారాన్ని కనుగొంది : ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేయండి. బొగ్గు రేకులను నడపండి! మోదీ హై, ముమ్కిన్‌ హై’ అని కేంద్ర మాజీ మంత్రి వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. తరువాత, చిదంబరం మరో ట్వీట్‌లో బొగ్గు, రైల్వే, విద్యుత్‌ మంత్రిత్వ శాఖలు తమ ‘భారీ అసమర్థతను’ దాచడానికి నిర్విరామంగా సాకులను కనిపెడుతున్నాయని విమర్శించారు. ‘వి`ఆకారంలో వృద్ధి లేనప్పటికీ, బొగ్గు-రైలు-విద్యుత్‌ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం ‘పూర్తిగా సంసిద్ధంగా లేదు’ అని చిదంబరం పేర్కొన్నారు. కొరతలు కొనసాగుతున్నందున, ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున, దయచేసి మరిన్ని కష్టాల కోసం ధైర్యంగా ఉండండి అని అన్నారు. కాగా, వడగాలులు పెరగడంతో దేశంలోని గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ శుక్రవారం 207.11 గెగావాట్లు ఆల్‌-టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. బొగ్గు రవాణాను సులభతరం చేయడానికి రైల్వే 42 ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసింది. బొగ్గు ఉత్పత్తి ప్రాంతాలను కవర్‌ చేసే ఆగ్నేయ మధ్య రైల్వే (ఎస్‌ఈసీఆర్‌) డివిజన్‌ 34 రైళ్లను రద్దు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img