జగన్ సర్కార్ మళ్లీ యూటర్న్
మెరుగైన సలహాలు, సూచనలు స్వీకరించేందుకే ఈ నిర్ణయమని వెల్లడి
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకున్న జగన్ సర్కార్ 24 గంటలు గడవక ముందే మరో కీలక బిల్లు అయిన శాసనమండలి రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. గత సంవత్సరం జనవరిలో మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును అసెంబ్లీలో ఆమోదించి, తర్వాత శాసనమండలిలో ప్రవేశపెట్టగా, టీడీపీ మెజార్టీ సభ్యులున్న కారణంగా దానిని సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేశారు. దీంతో ఆగ్రహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకంగా శాసనమండలినే రద్దు చేయాలని నిర్ణయించారు. వెంటనే ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన అనంతరం కేంద్రానికి పంపగా, ఇప్పటివరకు అది పార్లమెంటు అజెండాలోకి కూడా చేరలేదు. ప్రస్తుతం శాసనమండలిలో బలాబలాలు తిరగబడ్డాయి. వైసీపీ మెజార్టీ సాధించింది. మండలి చైర్మన్గా వైసీపీ ఎమ్మెల్సీ మోషేన్ రాజు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ఈ అంశంపై యూటర్న్ తీసుకుంది. ఈ మేరకు శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మంగళవారం శాసనసభలో మండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తీర్మానం ప్రవేశపెట్టారు. గత ఏడాది జనవరి 27వ తేదీ కౌన్సిల్ను రద్దు చేస్తూ తీర్మానం చేశామని, దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో ఇప్పటివరకు దానిపై సందిగ్ధత కొనసాగుతున్న నేపధ్యంలో శాసన మండలిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సభకు వివరించారు. మండలి రద్దు ఉపసంహరణ తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ వివిధ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని, అవన్నీ కూడా చాలా త్వరగా చట్టం రూపంలో అమలు కావాలని ఒక ఉద్దేశం ఉంది. వివిధ కారణాల వల్ల అవి ఆలస్యమయ్యాయి. అప్పటి నిర్ణయాలపై అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులే ఎప్పుడైనా సుప్రీమ్. అయితే మెరుగైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి మండలి అవసరం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అసలు శాసనమండలే లేదు. ప్రజల కోసం మంచి చట్టాలు తీసుకురావాలన్నా, సవరించాలన్నా ఆ బాధ్యత అసెంబ్లీకి మాత్రమే ఉంటుంది. శాసనసభలో కూడా విద్యావంతులైన ఎంతోమంది సభ్యులు ఉన్నారు. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వారికి ఉంది. అందుకే ఆనాటి పరిస్థితులకనుగుణంగా కౌన్సిల్ను రద్దు చేస్తూ తీర్మానం చేశాం. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వానికి, హోమ్ మినిస్టర్కు సమాచారం అందించాం. ఇన్ని రోజులైనా కూడా అక్కడి నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఇటీవల వైసీపీకి చెందిన వారిని శాసనమండలి చైర్మన్ను ఎన్నుకున్నాం. ఆయన కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. ఒక సామాన్యుడు ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చన్న సందేశాన్ని జగన్ ప్రభుత్వం చాటి చెప్పింది. పాత సభ్యులతో పాటు, కొత్త సభ్యులు కూడా ఉత్సాహంగా పనిచేయాలన్న ఉద్దేశంతోనే, శాసనసభ తీసుకునే నిర్ణయాలకు మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలన్న ఆకాంక్షతో శాసనమండలిని కొనసాగించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందని బుగ్గన వివరించారు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం రద్దు చేసిన శాసనమండలిని, రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పునరుద్ధరించిందని, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో శాసనమండలి లేదని బుగ్గన తెలిపారు.