ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. 2021 చివరికల్లా అర్హులైనవారందరికీ పూర్తిగా కోవిడ్-19 టీకాలు అందజేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. 2021 చివరికల్లా అర్హులందరికీ కోవిడ్-19 వ్యాక్సినేషన్ పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు ్ల కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. 2022 రాబోతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ దీనిపై స్పందించారు. ‘‘2021 చివరికల్లా అందరికీ రెండు డోసుల వ్యాక్సిన్ అందజేస్తామని కేంద్రం వాగ్దానం చేసింది. నేడు సంవత్సరం ముగియబోతోంది. దేశం వ్యాక్సిన్ నుంచి ఇంకా దూరంగానే ఉంది. మరో వాగ్దానం మట్టి కరిచింది’’ అని మండిపడ్డారు.