శ్రీలంక ఆర్థిక మంత్రి అలీ సబ్రి
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ఉద్దీపన ప్యాకేజీని తయారు చేయడం ఆలస్యమవుతున్న నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంకకు చేయూతనివ్వడంలో భాగంగా మరో 500 మిలియన్ డాలర్ల రుణాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ సొమ్మును ఇంధన దిగుమతుల కోసం శ్రీలంక వినియోగిస్తుంది. ఈ వివరాలను శ్రీలంక ఆర్థిక మంత్రి అలీ సబ్రి తెలిపారు. ఇంధన దిగుమతి కోసం శ్రీలంకకు అదనంగా 500 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు భారత ప్రభుత్వం అంగీకరించిందని, మరొక 1 బిలియన్ డాలర్ల రుణాన్ని ఇవ్వడంపై భారత ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఉద్దీపన ప్యాకేజీపై ఐఎంఎఫ్తో చర్చించేందుకు అలీ సబ్రీ ప్రస్తుతం వాషింగ్టన్లో ఉన్నారు. ఆసియన్ క్లియరింగ్ యూనియన్కు శ్రీలంక చెల్లించవలసిన 1.5 బిలియన్ డాలర్ల దిగుమతుల చెల్లింపులను వాయిదా వేసేందుకు భారత్ అంగీకరించింది.