కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్..
రాష్ట్రాల్లో ఉత్పత్తి ఆధారంగా ధాన్యం, బియ్యం సేకరణ చేయడం సాధ్యం కాదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. లోక్సభలో ఎంపీలు సుమలత, రాజ్దీప్రాయ్, మనోజ్ సహా పలువురు సభ్యులు ధాన్యం సేకరణపై అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ మంత్రులు పీయూష్ గోయల్, ఆ శాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. తెలంగాణలో ఉత్పత్తి అయిన ధాన్యం, బియ్యం మొత్తాన్ని కొనలేమన్నారు. అదనంగా ఉన్న ఉత్పత్తుల డిమాండ్, సరఫరా ఆధారంగానే కొనుగోలు ఉంటాయని స్పష్టం చేశారు మంత్రి పీయూష్ గోయల్. అస్సాంలో ధాన్యం సేకరణపై అడిగిన ప్రశ్నకు లోక్ సభ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ధాన్యం సేకరణ కేవలం ఉత్పత్తి పైనే ఆధారపడి ఉండదు. మద్దతు ధర, డిమాండ్ , సప్లై లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టత ఇచ్చారు కేంద్ర మంత్రి.వరి ధాన్యం కోనుగోలుపై కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. బీజేపీ ఎంపీలు మంగళవారం మంత్రి పీయూష్ గోయల్ను కలిసి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో దుష్ప్రచారం చేస్తోందంటూ చర్చించిన విషయం తెలిసిందే. మరోవైపు వడ్ల కొనుగోలు అంశంపై గురువారం తెలంగాణ మంత్రులకు పీయూష్ గోయల్ అపాయింట్మెంట్ ఇచ్చారు.